
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు యువతులు శనివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తండ్రి మందలించాడని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతుండగా.. పోలీసులు మాత్రం దర్యాప్తు తర్వాతే మృతికి గల కారణాలపై ఓ అంచనాకి వస్తామని చెబుతున్నారు.
వినీల (17), అఖిల (16) అక్కాచెల్లెళ్లు. వినీల ఈ మధ్య ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో పెద్దలు పంచాయితీ పెట్టి కులాంతర వివాహం వద్దని సర్దిచెప్పి ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఏంటని ఆ అక్కాచెల్లెళ్లను తండ్రి మందలించగా.. మనస్థాపానికి గురైన ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికీ రెయిలింగ్కి చున్నీతో ఉరి వేసుకున్నారు!. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఉరివేసుకొని మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఈ అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబ స్వస్థల నెల్లూరు జిల్లా ఉదయగిరిగా సమాచారం.