
సాక్షి,హైదరాబాద్: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో చాలాచోట్ల ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు వాతావరణశాఖ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. కాగా, అల్పపీడనం కారణంగా శనివారం జనగాం జిల్లా ఘనపూర్, కామారెడ్డిలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లెలో 6, జగిత్యాల జిల్లా మల్లాపూర్, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరులో 4 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపింది.