బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం | Harish Rao letter to Minister Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం

Jun 16 2025 3:24 AM | Updated on Jun 16 2025 3:24 AM

Harish Rao letter to Minister Uttam Kumar Reddy

రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్‌ఎస్‌ మీకు తోడుగా నిలుస్తుంది 

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి–బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుతో గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని మాజీమంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్టు డిజైన్, కేంద్రానికి పీఎఫ్‌ఆర్‌ (ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్‌) సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్‌ఎస్‌... ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుందని వెల్లడించారు. 

ఈ మేరకు గోదావరి బనకచర్ల అంశంపై మంత్రి ఉత్తమ్‌కు మాజీమంత్రి హరీశ్‌రావు ఆదివారం ఒక లేఖ రాశారు. ఈ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించేలోపే, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉండగా, ఏపీ యూనిలేటరల్‌గా ముందుకెళ్తుండటం అన్యాయమన్నారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి మంత్రికి ఈ ఏడాది జూన్‌ 13న మంత్రి ఉత్తమ్‌ లేఖ రాయడాన్ని హరీశ్‌రావు అభినందించారు. ‘ఏపీ తీసుకుంటున్న చర్యలు.. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంతోపాటు నదీ జలాల బోర్డుల నియమాలను ఉల్లంఘించడమే. వెంటనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలి. 

గోదావరి జలాల్లో 969 టీఎంసీల తెలంగాణ వాటాలో ఇప్పటివరకు వినియోగం 600 టీఎంసీలకు పెరిగింది. గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్‌ వంటి బరాజ్‌లు, 19 లక్షల ఎకరాల స్థిరీకరణతో గోదావరి బేసిన్‌ అభివృద్ధి, చెరువులు, చెక్‌ డ్యామ్‌లు, మిషన్‌ కాకతీయ, కాల్వల ద్వారా గోదావరి నీటిని వ్యవస్థీకృతంగా వినియోగంలోకి తెచ్చాం. కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు నివేదిక, సమ్మక్కసాగర్, వార్ధా (బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాజెక్టు) డీపీఆర్‌లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 

ఏపీ వానాకాలపు వరద జలాలే తరలిస్తామన్నా, గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డ్‌లో ‘ఆల్‌ వాటర్స్‌’అనే పదమే ఉన్నదని నిపుణుల అభిప్రాయం. అదనపు జలాలు అనే అంశం గోదావరి అవార్డులో లేదు. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ముందు తెలంగాణకు ఈ 157.5 టీఎంసీల అదనపు వాటాను కోరాలి. న్యాయ నిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలి. కేసీఆర్‌ పోరాట ఫలితంగా ఇప్పుడు 45 టీఎంసీలతో పాటు 112.5 టీఎంసీల అదనపు వాటా కోసం ట్రిబ్యునల్‌ ముందు వాదించే అవకాశం వచ్చింది’అని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement