Telangana: ఉత్తమ ఠాణాల జాబితాలో మనవి మూడు
జాతీయస్థాయిలో సైబరాబాద్, ఏడూళ్ల బయ్యారం, ఆలేరు ఠాణాలకు గుర్తింపు
వీటి నుంచి రెండు స్టేషన్లకు ఉత్తమ ఠాణాలుగా అవార్డు
ఫ్రెండ్లీ పోలీసింగ్తో దక్కిన అరుదైన గౌరవం
పినపాక: దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోలీసు స్టేషన్ల జాబితాలో తెలంగాణ నుంచి సైబరాబాద్, ఏడూళ్ల బయ్యారం, ఆలేరు ఠాణాలకు చోటు దక్కింది. 2020–21 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ పోలీసు స్టేషన్ అవార్డులు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 16,671 పోలీసు స్టేషన్లతో కేంద్రం ఓ ప్రాథమిక జాబితాను రూపొందించింది.
ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ 3 స్టేషన్లకు చోటు లభించింది. పోలీసు స్టేషన్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడం, నేరాలు జరగకుండా ముందస్తు కట్టడి, సంఘ విద్రోహశక్తులను అదుపు చేసేందుకు తీసుకున్న చర్యల వంటి అంశాలను పరిశీలించిన కేంద్ర హోంశాఖ ఈ జాబితాను రూపొందించింది.
వడపోత అనంతరం రాష్ట్రంలో రెండు స్టేషన్లకు అవార్డు లభించే అవకాశముందని సమాచారం. ఇలా ప్రతీ రాష్ట్రంలో రెండు స్టేషన్లకు ఉత్తమ ఠాణా అవార్డులు ఇస్తారు. కాగా, జాబితాలో పేరు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పనితీరు, దాని పరిధిలో ఉన్న గ్రామాల్లో ప్రజలతో పోలీసుల ప్రవర్తన.. తదితర అంశాలపై కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన అధికారులు తాజాగా రెండు రోజులపాటు స్థాని కంగా వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించారు.