రాష్ట్రంలో 220 రకాల వరి | Global Rice Summit begins in Hyderabad | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 220 రకాల వరి

Jun 8 2024 4:45 AM | Updated on Jun 8 2024 4:45 AM

Global Rice Summit begins in Hyderabad

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

రైస్‌ మిల్లింగ్‌ ఇండస్ట్రీని విస్తరిస్తామన్న మంత్రి ఉత్తమ్‌ 

హైదరాబాద్‌లో గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 220 వెరైటీల వరి సాగు జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు. ఇందులో 60 శాతం ముతక రకాలు ఉన్నాయని చెప్పారు. 

కొత్త ప్రభుత్వం స్థానికంగా, ప్రపంచ మార్కెట్‌లో ఎక్కువ గిరాకీ ఉన్న మంచి రకాల వరి వైపు వెళ్లేలా రైతులను ప్రోత్సహించడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని అన్నారు. గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌–2024 శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, 30 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. 

వరి సాగులో రాష్ట్రం నంబర్‌ వన్‌
వరి సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. గతేడాది 1.2 కోట్ల ఎకరాలు సాగవగా, 26 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరిగిందని తెలిపారు. తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కలిగిన సూపర్‌ ఫైన్‌ రైస్‌ రకం తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048) దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిందన్నారు. 

రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా రాష్ట్రం: ఉత్తమ్‌
తెలంగాణ రాష్ట్రం రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా అవతరించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల రైతులు ఒక సంవత్సరంలోనే 2 , 3 సార్లు వరి పండిస్తారని చెప్పారు. రాష్ట్రంలో రైస్‌ మిల్లింగ్‌ ఇండస్త్రీని విస్తరిస్తామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement