సాక్షి యాదాద్రి: చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలోని బృందావనం ఫార్మా కంపెనీలో (శనివారం) ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా అక్కడి ఒక కంపెనీలో రెండు రియాక్టర్ లు పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, నలుగురు కార్మికులు గాయపడ్డట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకవచ్చాయి.
దాదాపు మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి వచ్చినట్లు సమాచారం. కాగా ప్రమాద సమయంలో కంపెనీలో 11 మంది ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. అగ్నిప్రమాదం సమయంలో భారీ శబ్ధాలు రావడంతో అక్కడి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
మరోవైపు ఈ ప్రమాదంపై స్థానికులతో పాటు కార్మికుల కుటుంబ సభ్యులు కంపెనీ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. కంపెనీలో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటే అధిక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల ఫార్మా కంపెనీలలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యవహారం పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది.


