ఇచ్చోడ మండలం జామిడికి చెందిన రైతు కిల్లరే శేషారావు మూడెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో ఇటీవల సోయా వేశాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విత్తనాలు మొలకెత్తాయి. ఎరువు వేయాల్సి ఉండగా భూమిలో తేమ కారణంగా అరక నడవలేని పరిస్థితి. దీంతో తమ్ముడు ప్రదీప్ సాయం తీసుకున్నాడు. అతడు తాడుతో ముందుకు లాగుతుండగా వెనక నుంచి అన్న ఇలా ఎరువు వేస్తూ కనిపించాడు.
-ఆదిలాబాద్
సార్లూ.. జర పట్టించుకోండి!
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా తమ గ్రామం రహదారి సౌకర్యానికి నోచుకోవడం లేదంటూ నార్నూర్ మండలం మాలేపూర్ పంచాయతీ పరిధిలోని చిత్తగూడవాసులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఏటా వానాకాలంలో వాగొస్తే బాహ్యప్రపంచానికి దూరంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల తీరును నిరసిస్తూ ఆదివారం ఉమ్రి వాగులో దిగి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు వాగుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.
– నార్నూర్


