గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఇద్దరు సూడాన్ దేశస్తులకు ఎబోలా నెగెటివ్ వచ్చినట్లు వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. సూడాన్ నుంచి మోకాలి చికిత్స కోసం నగరంలోని అపోలో ఆస్పత్రికి వచ్చిన అబ్దుల్ రజీమహ్మద్ (23) ఎబోలా లక్షణాలతో ఈనెల 4వ తేదీ రాత్రి గాంధీ ఐసోలేషన్ వార్డులో చేరాడు. శాంపిల్స్ సేకరించి సీసీఎంబీకి పంపించగా ఎబోలా నెగెటివ్ వచ్చింది.
ఈమేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని పుణే వైరాలజీ ల్యాబ్ తమకు అందిన శాంపిల్స్లో ఎబోలా వైరస్ ఆనవాళ్లు లేవని స్పష్టం చేస్తూ శనివారం సాయంత్రం ధ్రువీకరించిందని గాంధీ సూపరింటెండెంట్ వాణి, గాంధీ నోడల్ ఆఫీసర్ వంశీకృష్ణ తెలిపారు. గాంధీ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న సూడాన్కే చెందిన మరోవ్యక్తి మహ్మద్ యాహ్యాయాగోబ్ అహ్మద్ (35)కు కూడా ఎబోలా నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అబ్దుల్రజీ మహ్మద్కు సహాయకుడిగా సూడాన్ నుంచి వచ్చిన 22 ఏళ్ల యువకుడిలో ఎలాంటి ఎబోలా లక్షణాలు లేనప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్కు తరలించారు.
ఐసోలేషన్లో ఉన్న ఇరువురికి ఎబోలా నెగెటివ్ రావడంతో తెలంగాణ ప్రజలతోపాటు వైద్యవర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఎబోలా నెగిటివ్ వచ్చినప్పటికీ 48 గంటల తర్వాత మరోమారు శాంపిల్స్ సేకరించి నిర్ధారణకు పంపిస్తారు. రెండవ నివేదికలో కూడా ఎబోలా నెగెటివ్ వస్తే ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జి చేసి 21 రోజులు హోం క్వారంటైన్కు తరలిస్తారని వంశీకృష్ణ వెల్లడించారు.


