హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా చేపట్టాల్సిన పలు కీలక అంశాలపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పోలీసు శాఖకు సంబంధించిన పలు విధానపరమైన, పరిపాలనా, సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఎస్ఆర్సీ (SRC) నివేదిక అమలు, మావోయిస్టు ముప్పు పేరుతో అవసరానికి మించి కల్పించిన భద్రతను ఉపసంహరించడం ద్వారా దాదాపు 400 మంది పోలీసు సిబ్బందిని, బుల్లెట్ప్రూఫ్ వాహనాలను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావడం, శాఖలోని సిబ్బంది, వాహనాల ఆడిట్ మరియు అమలు విధానంపై సమీక్ష నిర్వహించారు.
అలాగే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ యూనిట్లను ఒకే క్యాంపస్ నుంచి నిర్వహించే అంశం, తెలంగాణ పోలీసు మాన్యువల్ తుది రూపకల్పన, ఐపీఎస్ అధికారుల యూనిఫాంలో క్రాస్ బెల్ట్లు, లాఠీలు వంటి సంప్రదాయ అంశాల ప్రస్తుత అవసరంపై చర్చించారు.
తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) సిబ్బందికి సంబంధించిన వివిధ సమస్యలు, వాటి పరిష్కారంలో ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయం, విజిలెన్స్, ఆహార కల్తీ నిరోధం, డ్రగ్ కంట్రోల్ వంటి రంగాల్లో కొత్త ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ఏర్పాటు, ట్రాఫిక్ & రోడ్డు భద్రత బ్యూరో ఏర్పాటు వంటి అంశాలను సమావేశంలో సమీక్షించారు.
ఇదే సందర్భంగా ప్రస్తుత సాంకేతిక అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ మరియు కంప్యూటర్ సర్వీసెస్ విభాగాన్ని ఆధునీకరించడం, అలాగే సీసీటీఎన్ఎస్ 3.0 (CCTNS 3.0), టీజీ-కాప్ 3.0 (TG-COP 3.0), హాక్ఐ 3.0 (Hawk Eye 3.0) ప్రాజెక్టుల పురోగతిపై కూడా డీజీపీ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అధికారులు చేసిన సూచనలు, అభిప్రాయాలను పరిశీలించి, తెలంగాణ పోలీసు శాఖ భవిష్యత్ విధానాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని డీజీపీ తెలిపారు.


