మత విద్వేష రాజకీయాలు శాశ్వతం కావు..
అసమానతలు పెరిగేకొద్దీ తిరుగుబాటు అనివార్యం
వామపక్ష ఆలోచనలకు ఆదరణ పెరుగుతోంది
మేము బలంగా పుంజుకుని ప్రజాశక్తిగా ఎదుగుతాం
‘మీట్ ది ప్రెస్’లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
సాక్షి, హైదరాబాద్: ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజమేనని, సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక అసమానతలు పెరుగుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టు భావజాలంపై మార్క్స్ రాసిన ‘దాస్ కాపిటల్’గ్రంథాన్ని అధ్యయనం చేసేవారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. అమెరికా వంటి దేశాల్లో కూడా వామపక్ష ఆలోచనలకు ఆదరణ పెరుగుతుండటం అందుకు నిదర్శనమన్నారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో జాన్ వెస్లీ మాట్లాడారు. మత, ప్రాంత, కుల, డబ్బు, ప్రలోభాలతో చట్టసభల్లో తమకు సీట్లు తగ్గిన మాట వాస్తవమేననీ, అయితే, వాటి పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. తాము బలంగా పుంజుకుని ప్రజాశక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
3 నెలలు విస్తృత పర్యటనలు
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని, వచ్చే మూడు నెలలపాటు గ్రామాలు, బస్తీల్లో విస్తృత పర్యటనలు నిర్వహించి ప్రజలను కలుస్తామని జాన్ వెస్లీ తెలిపారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పులు రాలేదన్నారు. రైతుల పంటలను కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. దేశంలో అసమానతలు పెరిగేకొద్దీ ప్రతిఘటన, తిరుగుబాట్లు అనివార్యమవుతాయన్నారు. మత విద్వేషాలు, భ్రమల ఆధారంగా చేసే రాజకీయాలు శాశ్వతంగా నిలవవని వ్యాఖ్యానించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం ఆధారంగా ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లాభపడాలనే దురాలోచనతో ఉందని ఆరోపించారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ ప్రయోగం చేసిన బీజేపీ తెలంగాణవైపు దృష్టి సారించిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని చెప్పి తర్వాత మాట మార్చిందనీ, ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని కాంగ్రెస్ సర్కారు విస్మరించిందని విమర్శించారు.
ఉచిత విద్య, వైద్యం
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించాలని జాన్ వెస్లీ కోరారు. ఉచిత విద్య, వైద్యం కోసం దీర్ఘకాలిక పోరాటాలు చేపడతామని ప్రకటించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరిన ఆయన.. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు గృహాలు లేవని, వారికి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన జాన్ వెస్లీ, కమ్యూనిజంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న అజ్ఞాని అని విమర్శించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు హష్మీ సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి వి.రమేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.


