
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృత్యు ఘోష ఆగడం లేదు. ఇవాళ ఉదయం ఐదు కోడెలు మృతి చెందాయి. గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో గోశాల సిబ్బంది ఖననం చేశారు. రెండు రోజులుగా చర్యలు తీసుకుంటున్నా కోడెల మరణాలు ఆగడం లేదు.
సాక్షాత్తు జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారుల సూచనలనూ గోశాల సిబ్బంది బేఖాతర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోశాల నిర్వాహకులను వెంటనే సస్పెండ్ చేయాలని హిందూ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. నేటి నుంచి ప్రారంభించనున్న కోడెల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని వీహెచ్పీ డిమాండ్ చేస్తోంది.
కాగా, శుక్రవారం ఒక్కరోజే 8 కోడెలు మృత్యువాత పడ్డాయి. అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో వాటిని ఖననం చేశారు. శ్రీ రాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను తిప్పాపూర్లోని గోశాలలో సంరక్షిస్తున్నారు. ఈ గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉండటంతో తొక్కిసలాట జరిగి చనిపోతున్నాయనే ఆరోపణలున్నాయి.
భక్తులు దేవుడికి సమర్పించిన కోడెలను సంరక్షించాల్సిన దేవాదాయ శాఖ వాటికి మరణశాసనం లిఖిస్తోంది. కొందరు అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం ఫలితంగా కొన్ని రోజులుగా రోజుకు 8 నుంచి 10 కోడెలు ప్రాణాలు వదులుతున్నాయి. దీనిపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్థానిక యంత్రాంగం చేతులెత్తేసింది. చనిపోయిన కోడెలను ఖననం చేయటం తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేకపోతోంది.
