అంతా మీ ఇష్టమేనా..?: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Fires On education officials | Sakshi
Sakshi News home page

అంతా మీ ఇష్టమేనా..?: సీఎం రేవంత్‌

Jun 26 2025 1:24 AM | Updated on Jun 26 2025 8:12 AM

CM Revanth Reddy Fires On education officials

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఎందుకు ఆపుతున్నారు.. పాత ఫీజులతో ఇవ్వాలన్నా.. లెక్క చేయరెందుకు?  

ఉన్నత విద్యామండలితో పంచాయితీ ఏంటి  

వాళ్లూ.. మీరూ కూర్చొని మాట్లాడుకోండి 

విద్యాశాఖ, సాంకేతిక విద్య అధికారులపై సీఎం మండిపాటు 

వ్యక్తిగత ప్రతిష్ట మానుకొని కలిసి పనిచేయాలని సూచన 

విద్యాశాఖ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు అధికారులే అడ్డు పడుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికారుల సమన్వయలోపంతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతోందని ఆయన అన్నట్టు సమాచారం. అసలు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ను ఎందుకు ఆపుతున్నారో చెప్పా లని అధికారులను నిలదీసినట్టు తెలిసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం బుధవారం సమీక్షించారు. ముఖ్యంగా సాంకేతిక విద్యామండలి, విద్యాశాఖ ముఖ్య అధికారుల పనితీరుపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. 

ఈ సందర్భంగా అధికారుల మధ్య కొనసాగుతున్న కోల్డ్‌వార్‌పై సీఎం సీరియస్‌ అవ్వడంపై అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం... సమావేశంవివరాలు ఇలా ఉన్నాయి. పాత ఫీజులతోనే కౌన్సెలింగ్‌ చేపట్టాలని గతంలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఉన్నత విద్యామండలి త్వరలో కౌన్సెలింగ్‌ చేపడతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాంకేతిక, ఉన్నతవిద్య అధికారులు అడ్డుపడటం వివాదానికి కారణమైంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిసింది.  

ఉన్నత విద్యామండలిపై నిందలెందుకు ? 
ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ఇప్పటి వరకూ అనేక ఉమ్మడి ప్రవేశ పరీక్షలను దిగి్వజయంగా నిర్వహించారని, ఎక్కడా ఎలాంటి సమస్యలు రాలేదని సీఎం సమావేశంలో కొనియాడారు. కేవలం ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ విషయంలోనే సమస్య ఎందుకు వస్తుందని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా ‘మండలి అధికారులు ఇష్టానుసారం చేస్తున్నారు’అంటూ విద్యాశాఖ అధికారులు అనడంపై సీఎం సీరియస్‌ అయినట్టు తెలిసింది. వ్యక్తిగత సమస్యలతో విద్యార్థులకు అసౌకర్యం కలిగించేలా చేయడం సరికాదని అన్నట్టు సమాచారం. 

ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డితో తాను స్వయంగా మాట్లాడతానని, ఆయన సంస్కరణలపై పట్టుదలగా ఉన్నారని సీఎం అన్నట్టు తెలిసింది. సాంకేతిక విద్య అధికారుల ప్రమేయం లేకుండా కౌన్సెలింగ్‌ చేపడతామని ఉన్నత విద్యామండలి చెప్పడమే నేరంగా భావించడం సరికాదని సీఎం హితబోధ చేసినట్టు తెలిసింది. ఇంజనీరింగ్‌ ఫీజుల నిర్ధారణపై కమిటీ వేయాలనే ప్రభుత్వ ఆలోచన కూడా కౌన్సెలింగ్‌ జాప్యానికి కారణమన్న అధికారుల వాదనతో సీఎం ఏకీభవించలేదని తెలిసింది. అధికారులంతా ఒకసారి కూర్చొని వ్యక్తిగత అంశాలుంటే మాట్లాడుకోవాలని సూచించినట్టు తెలిసింది.  

బడిబాటపై అసంతృప్తి  
బడిబాటపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ బడుల్లో ఎక్కువ మందిని చేర్చడమే లక్ష్యంగా చేపట్టిన బడిబాట ఆశించిన పురోగతి సాధించలేదని ఆయన అన్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులే ఈ కార్యక్రమాన్ని లైట్‌గా తీసుకున్నారని, ఇక క్షేత్రస్థాయిలో ఎందుకు స్పందన ఉంటుందని సీఎం అన్నట్టు సమాచారం.  
 
ప్రభుత్వ బడులను అదనపు కలెక్టర్లు సందర్శించాలి : సీఎం 
ప్రతీజిల్లా అదనపు కలెక్టర్‌ వారంలో రెండుసార్లు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సమావేశ వివరాలపై బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 48 వేల మంది చేరినట్టు సీఎం తెలిపారు. 

పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త గదులను నిర్మించాలని అధికారులకు చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు పాఠశాలల్లో వసతులు కల్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల వంట చేసే మహిళలకు విముక్తి కల్పించాలని, సోలార్‌ కిచెన్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్‌లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యకు పొంతన ఉండటం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. 

వారంతా ఇంటర్‌లో చేరేలా చూడాలన్నారు. ఇంటర్‌ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ దేవసేన, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరిత తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement