
సగటున రూ.13 వేలు దాటని క్వింటాల్ ధర
కోల్డ్ స్టోరేజీల్లో లక్షలాది బస్తాల నిల్వ
చైనా నుంచి ఆర్డర్లు లేక వ్యాపారుల వెనుకంజ
ఖమ్మం వ్యవసాయం: విదేశీ ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడంతో మిర్చి ధర పెరగలేదు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో పండించే తేజా రకం మిర్చికి విదేశాల్లో డిమాండ్ ఉంటుంది. ఈ మిర్చిని చైనా, మలేషియా, థాయ్లాండ్, బంగ్లాదేశ్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ ఏడాది చైనాలోనూ ఇదే రకం పంట సాగు విస్తీర్ణం పెరగడంతో అక్కడి నుంచి ఎగుమతిదారులకు ఆశించిన స్థాయిలో ఆర్డర్లు రాలేదు.
ప్రస్తుతం మిర్చి ధర క్వింటాల్కు సగటున రూ.13 వేలు పలుకుతుండగా, ఇది నాణ్యమైన మిర్చికే చెల్లిస్తున్నారు. కాస్త నాణ్యత తక్కువగా ఉంటే రూ.12 వేలు, మరీ తక్కువగా ఉంటే రూ.11 వేలకు మించి ధర పలకడం లేదు. అన్ సీజన్లో ధర వస్తుందనే ఆశతో రైతులు పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఒక్క ఖమ్మం జిల్లాలో 40 కోల్డ్ స్టోరేజీలు ఉండగా, 48 లక్షల బస్తాలు నిల్వ చేసినట్లు అంచనా.
సీజన్ ఆరంభం నుంచీ ఇంతే...
పంట సీజన్ ఆరంభం నుంచే మిర్చి ధర పతనం సాగుతోంది. అంతకు ముందు సీజన్(2023–24)లో మిర్చి క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.23 వేల ధర రావడంతో గతేడాది రైతులు ఆశగా సాగు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా తెగుళ్లతో దిగుబడి తగ్గినా.. మిగిలిన పంటకూ ధర లభించలేదు. గతేడాది నవంబర్లో రూ.18 వేలు ఉన్న ధర డిసెంబర్ నాటికి రూ.16,500కు పడిపోయింది.
ఇక జనవరి నుంచి కొత్త పంట విక్రయాలు ప్రారంభం కాగా రూ.15,500 వద్ద మొదలై ఫిబ్రవరిలో రూ.14,200కు, మార్చిలో రూ.14 వేలకు తగ్గింది. ఆపై మార్చి చివరి వారం నుంచి మరింత తగ్గుతూ ఏప్రిల్, మేలో రూ.13,500 నుంచి రూ.14 వేలు పలికింది. సాధారణంగా అన్ సీజన్లో పంటకు డిమాండ్ ఉండాల్సి ఉన్నా, జూన్లో మరికొంత తగ్గడం రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
101 బస్తాలు నిల్వ చేశా..
సీజన్లో క్వింటాల్కు రూ.14 వేలు అడిగితే అన్ సీజన్లో అ మ్మొచ్చని 101 బస్తాల నిల్వ చేశా. ఇప్పుడు సాగు అవసరాలకు అమ్ముదామంటే అప్పటి ధర రాక పోగా అదనంగా నిల్వ ఖర్చులు పడ్డాయి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంది. – పేలప్రోలు నరేశ్, గార్లొడ్డు, ఏన్కూరు మండలం