తీరని విషాదం: కొట్టి విసిరేస్తే కుమారున్ని కాటేసింది | Sakshi
Sakshi News home page

తీరని విషాదం: కొట్టి విసిరేస్తే కుమారున్ని కాటేసింది

Published Fri, Jun 10 2022 1:44 AM

Child Died With Snake Bite In Adilabad District - Sakshi

తాంసి: ఇంట్లో దూరిన విషసర్పాన్ని కర్రతో కొట్టి విసిరేస్తే.. అది సరాసరి ఆ ఇంటి యజమాని ఏకైక కుమారుడి పక్కనే పడి కాటేసింది..ప్రాణాలు వదులుతూ అభం శుభం తెలియని పసివాడిని బలి తీసుకుంది. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అంతర్గాం గ్రామంలో గురువారం జరిగింది.  

రెండేళ్లకే నూరేళ్లు 
గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బైరెడ్డి సంతోష్, అర్చన దంపతులకు 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత రెండేళ్ల క్రితం బాబు నైతిక్‌ (2) జన్మించాడు. ఇన్నేళ్లకు కలిగిన సంతానాన్ని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుతున్నారు.  

చనిపోయిందనుకుని..  
బైరెడ్డి సంతోష్‌ ఇంటి ఆవరణలోకి మధ్యాహ్నం రక్తపింజర పాము ప్రవేశించింది. అది గుర్తించిన సంతోష్‌ స్థానికుల సాయంతో దాన్ని కొట్టారు. పాము చనిపోయిందనుకుని స్థానికులు కర్రతో బయటకు విసిరేయగా అది సంతోష్‌ కుమారుడు నైతిక్‌ పక్కన పడింది. అది బాలుని కాలిపై కాటేయడంతో వెంటనే ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.

అప్పటికే విషం శరీరమంతా పాకడంతో వైద్యులు చికిత్స అంది స్తుండగానే చిన్నారి మృతి చెందాడు. పెళ్లయిన ఎన్నో ఏళ్ల తరవాత పుట్టిన బిడ్డను పాము బలి తీసుకోవడంతో సంతోష్, అర్చన దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Advertisement
Advertisement