మద్యం కొనేందుకు వెళితే కారుతో పరారయ్యాడు | Cars Theft In Hyderabad | Sakshi
Sakshi News home page

మద్యం కొనేందుకు వెళితే కారుతో పరారయ్యాడు

Mar 18 2025 8:51 AM | Updated on Mar 18 2025 8:51 AM

 Cars Theft In Hyderabad

హైదరాబాద్: మద్యం కొనుగోలు చేసేందుకు షాపులోకి వెళ్తున్న క్రమంలోనే.. గుర్తు తెలియని వ్యక్తి ఖరీదైన కారును కొట్టేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేట లీలానగర్‌కు చెందిన తోట ప్రసాద్‌ వ్యాపారవేత్త. ఆదివారం సికింద్రాబాద్‌లో పనులు ముగించుకుని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బేగంపేట గ్రీన్‌పార్క్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న రిలాక్స్‌ సంధ్య వైన్‌షాపులో  మద్యం కొనేందుకు తన ఎంజీ హెక్టార్‌ కారులో వెళ్లారు.

 కారును ఆఫ్‌ చెయ్యకుండా అలానే ఉంచి మద్యం షాపులోకి పోతుండగానే తన కారు ముందుకు వెళ్లడం ఆయన గుర్తించారు. వెంటనే అడ్డుకునేందుకు ప్రయతించే లోపే..  ఆగంతకుడు అమీర్‌పేట వైపు వాహనాన్ని తీసుకుని అతివేగంతో వెళ్లిపోయాడు. ఆందోళనకు గురైన ప్రసాద్‌ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైన్‌ షాపు ముందున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా.. నిందితుడిని  పట్టుకున్నట్లు కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడు గతంలో ఏదైనా దొంగతనాలు చేశాడా? పాత నేరస్తుడా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.   

Advertisement
 
Advertisement
Advertisement