పరీక్షల పంచాయితీ

Candidates and unemployed demand on TSPSC Paper Leak Issue - Sakshi

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై ‘లీకేజీ’ ఒత్తిడి 

నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేయాలంటున్న అభ్యర్థులు, విద్యార్థులు 

చైర్మన్‌ రాజీనామాకు రాజకీయ పార్టీల డిమాండ్‌ 

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలంటూ విజ్ఞప్తి 

ఇప్పటివరకు ఏడు పరీక్షలు నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ 

కేవలం ఏఈ పరీక్ష పేపర్‌ మాత్రమే లీకైందంటున్న కమిషన్‌ 

ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ 

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. పలు పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీకై ఉంటాయనే అనుమానాల నేపథ్యంలో.. కమిషన్‌ నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేయాలని అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఏకంగా కమిషన్‌ చైర్మన్‌ రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

ఇప్పటివరకు ఏడు పరీక్షలు 
రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చి న తర్వాత టీఎస్‌పీఎస్సీ వివిధ ప్రభుత్వ శాఖల్లో 17 వేల ఉద్యోగాల భర్తీకి 26 ప్రకటనలు జారీ చేసింది. ఇందులో ఇప్పటివరకు ఏడు పరీక్షలు నిర్వహించింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ప్రకటనలు వెలువడుతుండగా, వాటికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, పరీక్షా కేంద్రాల ఎంపిక, వాటి నిర్వహణ తదితరాలపై దృష్టి పెట్టిన టీఎస్‌పీఎస్సీ... వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతేడాది అక్టోబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది.

ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెన్టివ్‌ మెడిసిన్‌ విభాగంలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌ఓ) ఉద్యోగాల అర్హత పరీక్షలను గతేడాది నవంబర్‌ 7వ తేదీన నిర్వహించింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీడీపీఓ), అసిస్టెంట్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(ఏసీడీపీఓ), వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌లో మేనేజర్‌ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షను ఈ ఏడాది జనవరి మూడో తేదీన నిర్వహించగా.. ఇదే శాఖలో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌) ఉద్యోగాల అర్హత పరీక్ష ఈ ఏడాది జనవరి 8వ తేదీన నిర్వహించారు.

అలాగే ఇంజనీరింగ్‌ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష జనవరి 22న, ఆర్థిక శాఖకు సంబంధించిన డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ) అర్హత పరీక్ష ఫిబ్రవరి 26న, వివిధ ఇంజనీరింగ్‌ శాఖల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్, టెక్నికల్‌ ఆఫీసర్, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష మార్చి 5వ తేదీన నిర్వహించారు. ఇక ఈనెల 12న జరగాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష రద్దు కాగా, ఈనెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలు కూడా రద్దయ్యాయి. 

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ లీక్‌పై అనుమానాలు 
నూతన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనల్లో తొలుత నిర్వహించిన అర్హత పరీక్ష గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌. కాగా ఈ పరీక్షకు లీక్‌ కేసులో నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ కూడా హాజరై ఏకంగా 103 మార్కులు తెచ్చుకోవడంతో పేపర్‌ లీక్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పైగా ప్రవీణ్‌ టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ కంప్యూటర్‌ నుంచి ఓ ఫోల్డర్‌ మొత్తం కాపీ చేశాడని, అందులో వివిధ పరీక్షల పేపర్లు ఉన్నాయనే సమాచారం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు నిర్వహించిన ఏడు పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌ పెరుగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు.. టీఎస్‌పీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు, దీక్షలు చేపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా చేయాలని, కమిషన్‌ కార్యదర్శిని తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top