సాక్షి, కరీంనగర్: నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడికి ప్రయత్నం జరిగింది. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే క్యాంప్ కార్యాలయం, వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. బీజేపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి.

బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్యే కౌశిక్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు కోపం తెప్పించాయి. ఈ క్రమంలోనే ఆయనపై దాడికి ప్రయత్నించింది. దాడిలో కౌశిక్ క్యాంప్ కార్యాలయం కూడా ధ్వంసం చేశారు. ఈ దాడితో కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కౌశిక్ ఏమన్నారంటే..
కరీంనగర్లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.

గంగుల ఆఫీస్పైనా..
మరోవైపు.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు.


