ఆ తర్వాత ప్రతి కి.మీ.కు రూ.14
ఆటో చార్జీల సమీక్ష కమిటీ ప్రతిపాదన
ప్రభుత్వానికి నివేదిక.. పుష్కరం తర్వాత కొత్త చార్జీలు
సాక్షి, హైదరాబాద్: ఆటోరిక్షా మీటర్ చార్జీ లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కనీస చార్జీ రూ.20 నుంచి రూ.30కి, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కు నమోదయ్యే మొత్తాన్ని రూ.11 నుంచి రూ.14కు పెంచాలని ఆటో చార్జీల పునఃసమీక్ష కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈమేరకు రెండు రోజుల క్రితం నివేదిక అందజేసింది. దాన్ని పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని రెండుమూడు రోజుల్లో కొత్త చార్జీలను అధికారికంగా వెల్లడించి అమలులోకి తేనుంది. 2014 ఫిబ్రవరి 14న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించిన చార్జీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో వాటిని సవరించాలని, అవి తమకు సరిపోవడం లేదని ఆటోరిక్షా సంఘాలు కొంతకాలంగా చేస్తున్న డిమాండ్ను ప్రభు త్వం పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే.
వెరసి పుష్కర కాలం తర్వా త ఆటో చార్జీలు పెరుగుతున్నాయి. ఆటో డ్రైవర్ల సంఘాల విజ్ఞప్తుల మేరకు 2022లో ఏర్పాటు చేసిన కమిటీ తొలి 1.6 కిలోమీటర్లకు రూ.26, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కు రూ.15 చొప్పున చార్జీలు పెంచాలని సిఫారసు చేసింది. ఆ ప్రతిపాదనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగులో ఉంచింది. ఇటీవల ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల సంఘాలు ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచి్చన నేపథ్యంలో ప్రభుత్వం ఆటో చార్జీల అంశంపై మరోసారి దృష్టి సారించింది. చార్జీల పెంపుపై 15 రోజుల్లో ప్రతిపాదన పంపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో సంఘాలు సమ్మెను విరమించాయి.
కనీస చార్జి రూ.30 నుంచి రూ.50 మధ్యలో పెంచాలని కోరాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సెపె్టంబర్ 3న తన నివేదికను సమరి్పంచింది. వాహన కొనుగోలు, రుణా లు, తరుగుదల, ఇంధన ధరలు, ఆటోరిక్షాల మరమ్మతులు, బీమా, పన్నులు, నిర్వహణ వ్యయం, డ్రైవర్ ఆదాయం, ట్రాఫిక్ పరిస్థితులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఆటోరిక్షా నిర్వహణ వ్యయం కిలోమీటరుకు రూ.13.53గా లెక్కించింది. దీనిని రౌండ్ఆఫ్ చేసి రూ.14గా పరిగణించాలని సూచించింది.
కమిటీ సిఫారసులు ఇవే..
⇒ తొలి 1.6 కిలోమీటర్లకు కనీస చార్జీ: రూ.30
⇒ ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కు: రూ.14
⇒ వెయిటింగ్ చార్జీ: నిమిషానికి 75 పైసలు
⇒ ప్రయాణికుడితో పాటు తీసుకెళ్లే సామానుకు అదనపు చార్జీలు వర్తింపు
⇒ 60+40 సెం.మీ. కంటే తక్కువ పరిమాణంలోని బ్రీఫ్కేస్, హ్యాండ్బ్యాగ్ తది తరాలకు మినహాయింపు. గరిష్ఠంగా 100 కిలోల సామాను
⇒ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ చార్జీకి ఒకటిన్నర రెట్లు వసూలు చేసుకోవచ్చు.
ప్రతి ఆటోలో టారిఫ్ కార్డు
కమిటీ సిఫారసులను పరిశీలించి, 1988 మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67(1) ప్రకారం కొత్త ఆటో చార్జీలను నోటిఫై చేయాలని రవాణా శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. 2014లో జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 20ను రద్దు చేసి కొత్త చార్జీలను అమలు చేయాలని కోరింది. కొత్త చార్జీలు అమల్లోకి వచి్చన అనంతరం డిజిటల్ ఆటో మీటర్లను కొత్త టారిఫ్కు రీసెట్ చేసేందుకు మూడు నెలల గడువు ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. ఈ వ్యవధిలో పాత, కొత్త చార్జీల వివరాలతో కూడిన టారిఫ్ కార్డును ప్రతి ఆటోలో ప్రదర్శించాలని సూచించింది.
ఇతర నగరాలతో పోలిస్తే..
ఇతర నగరాల కంటే తెలంగాణలో కొత్త కనీస చార్జీ ప్రతిపాదన రూ.30గా ఉన్నప్పటికీ, బెంగళూరుతో పోలిస్తే తక్కువగా ఉండగా, కేరళం, ఢిల్లీతో సమానంగా ఉంది. అయితే ప్రతి అదనపు కిలోమీటర్కు రూ.14గా ప్రతి పాదించిన చార్జీ కేరళ (రూ.15), ముంబయి (రూ.17.14), బెంగళూరు (రూ.18) కంటే తక్కువగా ఉంది.
ఎంతెంత అదనం?
⇒ ప్రారంభ ప్రయాణంపై రూ.10 అదనపు భారం కనిపిస్తుంది.
⇒ 3 కిలోమీటర్ల ప్రయాణానికి ప్రస్తుతం రూ.35.40 అవుతుండగా, కొత్త చార్జీ అమల్లోకి వస్తే రూ.49.60 అవుతుంది.
⇒ 5 కిలోమీటర్ల ప్రయాణానికి పాత చార్జీ రూ.57.40, కొత్త చార్జీ రూ.77.60.
⇒ 10 కి.మీ. దూరానికి ప్రస్తుతం రూ.112.40 ఉంటే, కొత్త చార్జీ రూ.147.60.
⇒ 15 కి.మీ.కు ప్రస్తుతం రూ.167.40గాఉన్న చార్జీ రూ.217.60గా మారుతుంది.
అసలు మీటర్లు ఏవి?
ఛార్జీలు పెంచాలని ఆటో సంఘాలు కోరినా, నగరంలో ఎక్కడా ఆటోల్లో మీటర్ల వినియోగం లేదు. ఉబర్, ఓలా, ర్యాపిడోలతో అనుసంధానమైన వారు ఈ చార్జీలతో ప్రమేయం లేకుండా అగ్రిగేటర్ల సొంతచార్జీలనే వసూలు చేస్తున్నారు. వాటి కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే క్రమంలో, సొంత ఆటో వాలాలు మీటర్ల కనెక్షన్లు తొలగించి తోచిన మొత్తం వసూలు చేసుకుంటు న్నారు. తమ పరిధిలోకి రానందున అగ్రిగేటర్ ఆటోలపై రవాణాశాఖ చర్యలు తీసుకోవడం లేదు. సాధారణ ఆటోలను పట్టించుకోవటం ఎప్పుడో వదిలేసింది. వెరసి, ప్రభు త్వం నిర్ధారించే చార్జీలతో ప్రమేయం లేకుండా ప్రయాణికులు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు చార్జీల పెంపు పేరు తో అటు అగ్రిగేటర్ యాప్లు కూడా ఛార్జీలను మరింత పెంచబోతున్నాయి.


