సాక్షి, చైన్నె: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. వైష్ణవాలయాలో, ఇస్కాన్ మందిరాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం, రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం, మధురై అలగర్ ఆలయం, శ్రీవిళ్లిపుత్తూరు ఆండాళ్ అమ్మవారు, తిరువట్టారు ఆదికేవశ పెరుమాళ్, మన్నార్ కుడిలోని దక్షిణ ద్వారకగా పిలవబడే రాజగోపాలస్వామి తదితర వైష్ణవ క్షేత్రాలలో ప్రత్యేకపూజలు నిర్వహించా రు. భక్తులు తమ ఇళ్లల్లో చిన్ని కృష్ణుడి పాద ముద్రలతో రంగవళ్లులు తీర్చిదిద్దారు. చైన్నె ట్రిప్లికేన్లోని పార్ధసారధి, వడపళనిలోని భామారుక్మిణి, రాయపేటలోని గవుడియా కృష్ణుని, కేశవ పెరుమాళ్, మాధవ పెరుమాళ్ ఆలయాలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈసీఆర్ మార్గంలోని షోళింగనల్లూరు, అక్కరైలోని ఇస్కాన్ శ్రీకృష్ణుడి ఆలయంలో జన్మాష్టమి వేడుకలను కనులపండువగా నిర్వహించారు. భక్తులకు ఇస్కాన్ నిర్వాహ కులు ప్రసాదాలను పంపిణీ చేశారు. రాత్రి పదిన్నర గంటలకు రాధాకృష్ణులకు మహాభిషేకం చేపట్టారు.
వేలూరు, తిరువణ్ణామలైలో..
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని శ్రీ కృష్ణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని కాగిదపట్టరై ప్రాంతంలోని శ్రీ క్రిష్ణుని ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో వెలిసిన శ్రీనవనీత చిన్ని కృష్టుడికి సాయంత్రం 6 గంటలకు పుష్పాలంకరణ చేపట్టారు.
పళ్లిపట్టులో..
పళ్లిపట్టు: కృష్ణాష్టమి వేడుకలను పళ్లిపట్టులో కోలాహలంగా నిర్వహించారు. యాదవ మహాసభ ఆధ్వర్యంలోని స్థానిక సంగమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బాల గోపాలుడి విగ్రహానికి విశేష పూజలు జరిపించారు. మధ్యాహ్నం వెయ్యి మందికి అన్నదానం చేశారు. సాయంత్రం ఉట్లోత్సవం నిర్వహించారు.
కొత్తగుమ్మిడిపూండిలో..
తిరువళ్లూరు: కొత్తగుమ్మిడిపూండి దేవాంగ వీధిలోని వేణుగోపాలస్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడులను వైభవంగా నిర్వహించారు. కేఎస్ పార్థీబన్రాజు ఆధ్వర్యంలో చేపట్టిన నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. శనివారం వసంత్సోవం, ప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.


