సాక్షి, చైన్నె : చైన్నెలోని ఇండియన్ ఆర్మీకి చెందిన ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుంటున్న కేడెట్లు శుక్రవారం పలు సాహస విన్యాసాలు ప్రదర్శించారు. శనివారం గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ జరగనున్న నేపథ్యంలో, శుక్రవారం యువ అధికారులు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమానికి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కమాండెంట్, లెఫ్టినెంట్ జనరల్ మైఖేల్ ఏజే ఫెర్నాండెజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అద్భుతంగా ప్రదర్శన
చైన్నె ఆర్మీ అకాడమీ శారీరక దృఢత్వానికి ఇచ్చే ప్రాధాన్యతను చాటిచెబుతూ ప్రత్యేక విన్యాసాలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆయుధాలు లేకుండా శత్రువును ఎదుర్కొనే ఆర్మీ మార్షల్ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం డాన్స్, సంగీతం, పురాతన యుద్ధ కళ కలరిపయట్టు విన్యాసాలు వీక్షకులను కట్టిపడేశాయి. కేడెట్లు, శిక్షకులు కలసి చేసిన గురప్రు స్వారీ విన్యాసాలు అశ్వాలకు, స్వారీ చేసే కేడెట్లకు మధ్య అద్భుత సమన్వయాన్ని ప్రదర్శించాయి.
బంకర్ ధ్వంసం : యుద్ధ రంగంలో కేడెట్ల మనోధైర్యాన్ని, వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన బంకర్ల ధ్వంస శిక్షణ వారి వీరత్వానికి అద్దం పట్టాయి.అనంతరం ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమి కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ మైఖేల్ ఏజే ఫెర్నాండెజ్ మాట్లాడుతూ రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు, యుద్ధభూమిలో బలగాలను సమర్థవంతంగా నడిపించేందుకు ఈ యువ అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉన్నారని కొనియాడారు. కేడెట్లు, శిక్షకులను ప్రత్యేకంగా అభినందించారు.


