కొరుక్కుపేట: జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్) చైన్నెవిభాగం ఆధ్వర్యంలో వార్షిక ఆధ్యాత్మిక భజన పోటీలు( జూనియర్స్, సీనియర్స్) చైన్నె టీ.నగర్ లోని వాణీ మహల్ వేదికగా ఘనంగా నిర్వహించారు. ఈపోటీలకు నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థుల ఉత్సాహంగా పాల్గొని భజన పాటలతో ఆధ్యంతం అలరించారు. చిన్నారుల్లో ఆధ్యాత్మిక చింతన, పెద్దల యందు గౌరవం, సమాజం పై అవగాహన , హిందూ ధర్మ పరిరక్షణ తెలియజేసే విధంగా ప్రతీ ఏడాది త్రిదండి చిన జీయర్ స్వామి మంగళా శాసనాలతో గత మూడు దశాబ్దాలుగా భజన పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో శనివారం జె ట్ –చైన్నె అధ్యక్షులు పి.రవీంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉదయం నుంచి సాయంత్రం వరకు భజన పోటీలు నిర్వహించారు. ఇందులో రామ, కృష్ణ, నరసింహా, నారాయణ ,పండరినాథ, రామానుజుల భజన పాటలను అలపించి ఆద్యంతం ఆకట్టుకున్నారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లను నిర్వాహకులు ప్రదానం చేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రత్యేకించి ఇస్కాన్ చైన్నె కి చెందిన స్వామివార్ల బృందం పాల్గొని నృత్యంతో భజన పాటలను అలపించి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు. హరేరామ హరే కృష్ణ రామ రామ హరే హరే అంటూ భజన పాటలు పాడుతూ పోటీల్లో పాల్గొన్న చిన్నారులందరినీ ఉత్సాహపరిచారు. భజన పోటీలకు సహకారం అందించిన శ్రీసిటీ అధినేత రవి సన్నారెడ్డి అలాగే నాయుడు హాలు, వైశ్య చారిటీలు, ప్రశాంత్ తదితరులకు రవీంద్ర కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.


