కొరుక్కుపేట: రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్ (ఎస్ఆర్ఎంయూ) ప్రధాన కార్యదర్శి, ఆలిండియా రైల్వే ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.కన్నయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన సమస్యలలో గత రెండు నెలలుగా, కార్మికులకు వివిధ భత్యాలను నిలిపివేశారు. రాత్రి పని, ప్రయాణ భత్యం, ఓవర్ టైం భత్యం, వైద్య భత్యం, హజార్డ్, హార్డ్ వర్క్ భత్యాలు తదితర హక్కుల తిరస్కరణతో చాలా మంది కార్మికులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం చైన్నెలోని సదరన్ రైల్వే జీఎం కార్యాలయం సమీపంలో విలేకర్ల సమావేశంలో డాక్టర్ ఎన్.కన్నయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేను సర్వనాశనం చేస్తుందన్నారు. ఓ వైపు ప్రైవేటీకరణ, మరో వైపు కార్మికులకు ఇవ్వాల్సిన వివిధ భత్యాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్లోనూ తీవ్రంగా నిధులలో కోతలు వేసిందని అన్నారు. రూ.16,000 కోట్ల అంచనా బడ్జెట్ లో రూ.13,200 కోట్లకు తగ్గించారన్నారు. బడ్జెట్ కోతల పేరుతో కార్మికుల హక్కులను నిలిపివేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. వెంటనే రైల్వే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఎగ్మోర్ ప్రాంతంలో సేవల అంతరాయాలు చైన్నెని మాత్రమే కాకుండా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, నుండి వచ్చే రోజువారీ ప్రయాణికులను కూడా ప్రభావితం చేస్తున్నాయన్నారు. కాబట్టి ఇది కేవలం స్థానిక సమస్య కాదని, ఇది దక్షిణ భారత ప్రజల సంక్షేమాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్య అని తెలిపారు. అమృత్ భారత్ యోజన కింద ప్రకటించిన స్టేషన్ అబివృద్ధి పనులు చాలా చోట్ల అసంపూర్ణంగా ఉండటం వల్ల ప్రాథమిక సౌకర్యాలు కూడా దెబ్బతింటున్నాయని అన్నారు. ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న పునరుద్ధరణ పనుల కారణంగా చెంగల్పట్టు సబర్బన్ ఈఎంయూ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. దీని కారణంగా పని, విద్య, వైద్య వాణిజ్య ప్రయోజనాల కోసం రోజూ ప్రయాణించే వేలాది మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, దక్షిణ రైల్వే యాజమాన్యంతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా అనేక చర్యలు తీసుకోబడ్డాయన్నారు. ప్రయాణికుల అసౌకార్యాన్ని తగ్గించడానికి, చైన్నె బీచ్– తాంబరం, చెంగల్పట్టు మధ్య తాత్కాలిక ఈఎంయూ సేవలను ప్రవేశ పెట్టారన్నారు. సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.ఎన్.సింగ్తో చర్చించిన తర్వాత 12 కోచ్ ఈఎంయూ రైళ్లకు బదులుగా 15 కోచ్ లతో నడపడానికి అనుమతి ఇవ్వబడిందన్నారు. దక్షిణ రైల్వే పరిపాలన రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని, బీచ్, ఫోర్ట్, ఎగ్మోర్ మధ్య ఉదయం 20 బస్సులు, సాయంత్రం 20 బస్సులను నడపాలని ప్రతిపాదించబడిందని రైల్వే సీజన్ పాస్ హోల్డర్లు ఈ బస్సులలో ఉచితంగా ప్రయాణించడానికి తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని వెల్లడించారు.


