సాక్షి, చైన్నె: తమిళనాడు రాజధాని చైన్నెలో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజా రవాణాను మరింత ఆధునికీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం తండయార్పేటలో జరిగిన కార్యక్రమంలో రూ.170 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన వంద కొత్త లో–ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 25 ఏసీ బస్సులు ఉన్నాయి. ఈ 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. ఇవి తిరువొత్తియూర్, పూందమల్లి, కోయంబేడు, కిలాంబాక్కం తదితర 12 ప్రధాన మార్గాల్లో నడవనున్నాయి.
ఆధునిక డిపో ప్రారంభం
రూ.33.82 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన తండయార్పేట–1 ఎలక్ట్రిక్ బస్సు డిపోను ఆయన ప్రారంభించారు. రెండో దశలో భాగంగా మరో 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం రూ.289 కోట్ల వ్యయంతో ఛార్జింగ్ సదుపాయాలతో కూడిన కొత్త డిపోల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ప్రస్తుతం సాధారణ బస్సుల్లో ఉన్న చార్జీలే వసూలు చేస్తారు. అదనపు భారం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న రాయితీ ప్రయాణ కార్డులు, పాసులు ఈ బస్సుల్లో కూడా చెల్లుతాయని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సహకారంతో ఈ బస్సులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శివశంకర్, పి.కె.శేఖర్ బాబు, చైన్నె మేయర్ ప్రియ, ఎంపీ డాక్టర్ కళానిధి వీరాస్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


