తమిళసినిమా: అంథిల్ సినిమా, పలంపూర్ టాకీస్ సంస్థలు కలిసి నిర్మించిన చిత్రం ఓ బటర్ఫ్లై. తుల్సియా సంస్థ కన్సల్టింగ్ భాగస్వామిగా వ్యవహరించిన ఈ చిత్రానికి విజయ్ రంగనాథన్ కథ, కధనం, దర్శకత్వం, నిర్మాత భాద్యతలను నిర్వహించారు. నటి నివేద ప్రధాన పాత్రను పోషించిన ఇందులో సీబీ చంద్రన్, అతుల్, నాజర్, లక్ష్మీప్రియ చంద్రమౌళి, గీతాకై లాసం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో సైకిలాజికల్ థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందిన ఓ బటర్ఫ్లై చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 6న తెరపైకి రానుంది.ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని భరణి స్టూడియోలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి నివేద సతీష్ మాట్లాడుతూ తాను ఇంతకు ముందు కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించానన్నారు. ఆ చిత్రం కోసం ఏడాది పాటు కఠినంగా శ్రమించానని, చాలా నేర్చుకున్నానని చెప్పారు. అయితే తాను ఊహించిన ఫలితం దక్కక పోవడంతో సినిమా నుంచి కొంత కాలం దూరంగా వేరే వృత్తి చేపట్టాలని భావించానన్నారు. అలాంటి తరుణంలో ఓ బటర్ ఫ్లై చిత్ర కథను దర్శకుడు విజయ్ రంగనాథన్ చెప్పారన్నారు. ఆయన చేసిన నెరేషన్ తాను ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదన్నారు. దీంతో వెంటనే ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. ఇది హ్యూమన్ ఎమోషనల్తో కూడిన కొత్త బ్యానర్లో రూపొందిన కథా చిత్రం అని చెప్పారు. చిత్ర దర్శక నిర్మాత విజయ్ రంగనాధన్ మాట్లాడుతూ తాను సినిమా రంగంలోకి ప్రవేశించి ఏడెనిమిదేళ్లు అయ్యిందన్నారు. తన తల్లిదండ్రులు సినిమా భక్తులనే చెప్పాలన్నారు.దీంతో తనకు ఈ మార్గం సులభమైయిందన్నారు. సినిమాలో ఏదైనా కొత్తగా చేయలని భావించానన్నారు. అందుకు చాలా కాలం తీసుకున్నానని చెప్పారు. ఈ చిత్ర కథను చాలా కాలం క్రితమే రాసినట్లు చెప్పారు. ఆ తరువాత మరోసారి ఒక రచయితతో కలిసి మళ్లీ రాసినట్లు చెప్పారు. ఇందులో నటించే నటీనటుల కోసం చాలా కాలం వెతికానని, అలా నటి నివేద, సిబి చంద్రన్, అతుల్ లను ఎంపిక చేసినట్లు చెప్పారు. కథ కొత్తగా ఉండడంతో వారు నమ్మి నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు చెప్పారు. దీన్ని మిత్రులతో కలిసి నిర్మించినట్లు చెప్పారు. చిత్రాన్ని ఈనెల 6న విడుదల చేస్తున్నట్లు చెప్పారు.


