సాక్షి, చైన్నె: పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి రవాణా సౌకర్యం ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3234 అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. చైన్నె రాయపేటలోని అమీర్ మహల్ గ్రౌండ్లో జరిగిన గిఫ్ట్ ఆఫ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ద్వారా 425 మంది పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. దూర ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థుల ప్రయాణ కష్టాలను తగ్గించడం, పాఠశాల మధ్యలో మానేసే వారి సంఖ్యను అరికట్టడం, వారిలో ఉన్నత విద్య పై ఆసక్తిని పెంచడం తమ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం అని డిస్ట్రిక్ట్ గవర్నర్ వినోద్ సరోగి తెలిపారు.. విద్య ద్వారా సమాజ సాధికారత సాధించడమే రోటరీ నిరంతర లక్ష్యమని పేర్కొన్నారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన రోటరీ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మురుగానందం, ఆర్కాట్ యువరాజు దివాన్ నవాబ్జాదా మొహమ్మద్ ఆసిఫ్ అలీ,వివిధ క్లబ్ ల అధ్యక్షులు రవి సుందరేశన్, భాస్కరన్, బాల కార్తీక్, మహమ్మద్ కమల్, రవికుమార్, నబిన్ ప్రసాద్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


