సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలి
వేలూరు: వ్యవసాయాన్ని మెరుగు పరచడానికి తమిళనాడు ప్రభుత్వం నీటి నిర్వహణ ప్రాజక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వీఐటీ యూనివర్సిటీ చాన్స్లర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలో వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తిని పెంచేందుకు రెండు రోజుల ప్రదర్శన ఏటా నిర్వహించి రైతులను ఉత్సాహ పరచడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం వీఐటీలోని గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో ప్రారంభించిన వ్యవసాయ ప్రదర్శన శనివారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్బంగా వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పాటు చేసిన వ్యవసాయ ఎగ్జిభిషన్లో మొత్తం 145 స్టాల్స్ ఏర్పాటు చేసి అందులో వ్యవసాయం, టె క్నాలజి, వ్యవసాయ విత్తనాలు తదితర వాటిని రైతులకు అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైవిధ్యంగా ఏర్పాటు చేసిన వారికి బహుమతులు కూడా అందజేయడం జరిగిందన్నారు. ఈ ప్రదర్శనను సుమారు 5 వేల మంది రైతులు తిలకించడం జరిగిందన్నారు. దేశం అభివృద్ది చెందాలంటే స్థూల దేశీయ ఉత్పత్తి మాత్రమే సరిపోదని వ్యక్తిగత ఆదాయం ముఖ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 41 వేల చెరువులున్నాయని వేలూరు జిల్లాలో మాత్రం 1,200 చెరువులున్నాయని వీటన్నింటికి వర్షపు నీటిని తీసుకొచ్చి పూడిక తీత పనులు చేపట్టి వర్షపు నీరు చెరువులో ఉ ండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోనే అధికంగా వ్యవసాయ పంటలు దిగుబడి అవుతుందన్నారు. వ్యవసాయ పంటలను ప్లాట్లుగా మార్చకుండా వాటిలో పంటలు పండించేందుకు రైతులు ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం వ్యవసాయ పరిశోధన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీఐటీ ప్రొ. చాన్స్లర్ పార్థసారథి మాలిక్, వీఐటీ వ్యవసాయ విభాగం డీన్ రాజేంద్రన్, ఫ్రొఫెసర్ బాబు, రైతులు పాల్గొన్నారు.


