పట్టాభిరామపురంలో మురుగన్ విహారం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లు ఆదివారం పట్టాభిరామపురంలో విహరించి భక్తులకు కనువిందు చేశారు. తిరుత్తణి కొండపై కొలువైన సుబ్రహ్మణ్యస్వామి ఏడాదిలో ఒక్కసారి కొండ నుంచి దిగి వచ్చి భక్తులకు కటాక్షించడం పరిపాటి. ఆమేరకు పల్లకి మోసే గ్రామాలకు స్వామివారు ఊరేగడం ప్రతిఏటా జరుగుతుంటుంది. అందులో భాగంగా ఆదివారం తిరుత్తణి శివారులోని పట్టాభిరామపురంలో స్వామివారు ఊరేగారు. స్వామికి వివిధ పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి మెట్ల మార్గంలో మోసుకొచ్చి వాహన సేవలో కొలువుదీర్చి ఊరేగించారు. గ్రామీణులు రెండు టన్నుల పుష్పాలతో స్వామికి స్వాగతం పలికారు. కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. సాయంత్రం స్వామికి సుగంధద్రవ్యాలతో అభిషేక పూజలు చేసి రాత్రి గ్రామ వీధుల్లో స్వామి విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం రాత్రి 12 గంటలకు పోలీసులు, ఆలయ సిబ్బంది సమక్షంలో కొండ ఆలయం చేరుకున్నారు.


