
స్టాలిన్కు ప్రజలే గుణపాఠం చెప్పాలి
వేలూరు: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్టాలిన్కు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అన్నారు. ప్రజలను రక్షిద్దాం..తమిళనాడును కాపాడుకుందాం అనే నినాదంతో ఎడపాడి రాష్ట్ర వ్యాప్తగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపత్తూరు, జోలార్పేట, వానియంబాడి ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జోలార్పేట ఆంజనేయ గుడి వద్ద ప్రజల వద్దకే వెళ్లి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గత 2021 ఎన్నికల సమయంలో డీఎంకే 525 వాగ్దానాలు చేసి అందులో 98 శాతం అమలు చేశామని స్టాలిన్ ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు కూలి పెంచుతామని చెప్పి మోసం చేశారని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇంత వరకు ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వంలో రెండుసార్లు పంట రుణమాఫీ చేశామని, నీటిని నిల్వ చేయడానికి ప్రాజెక్టులు, చెక్డ్యామ్లు నిర్మించామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి పథకాలు ఇవ్వకుండా ప్రజలను ఎన్నికల సమయంలో మరోసారి మోసం చేసేందుకు మీతో స్టాలిన్ పథకాన్ని ప్రారంభించారన్నారు. ప్రజలు గత నాలుగేళ్లుగా డీఎంకే ప్రభుత్వ అవినీతి, అరాచకాలను చూశారని ఇకపై మోసపోరన్నారు. ఎడపాడి సమావేశాల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో చేరుకొని ఆయనకు ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రి కేసీ వీరమణి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.