ఆసక్తిగల వారు దరఖాస్తులు చేసుకోవాలి
26 నుంచి రెండు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలు
మఠంపల్లి : మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు శుభోదయ యువజ సంఘం ఆధ్వర్యంలో మాంట్ఫోర్డు ఉన్నత పాఠశాల మైదానంలో ఎద్దుల పందేలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి తెలి పారు. సోమవారం పాఠశాల మైదానంలో ఎద్దుల పందేల కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పోటీలను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆరు విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో విజేతలకు దాతల సహకారంతో రూ.7.50 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మధుసూదన్రెడ్డి, మనోజ్రెడ్డి, దిలీప్రెడ్డి, అఖిల్రెడ్డి, బాలరెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేటటౌన్ : వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా ఈ నెల 24 నుంచి జూన్ 7 వరకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారులు సిద్ధమయ్యారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసింది.
దరఖాస్తుల ఆహ్వానం
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు జిల్లాలోని ఉత్సాహవంతులైన వ్యాయమ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల నుంచి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. శిబిరం నిర్వహించదలిచిన వారు క్రీడా వివరాలు, గ్రామం, ప్రదేశం వంటి పూర్తి వివరాలతో ఈ నెల 23లోగా జిల్లా యువజన, క్రీడలశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడలశాఖ అధికారి వెంకట్రెడ్డి తెలిపారు. వివరాలకు సెల్ 9100949979 నంబరును సంప్రదించాలని కోరారు.
రూ.60వేలు మంజూరు
క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం జిల్లాకు రూ.60వేలు మంజూరు చేసింది. ఒక్కో శిక్షకుడికి రూ.5వేల చొప్పున 10 మందికి రూ. 50వేలు ఇవ్వనున్నారు. మిగిలిన రూ.10వేలు ప్రథమ చికిత్స, సర్టిఫికెట్ల కోసం ఖర్చు చేయనున్నారు. శిబిరాలను జిల్లా యువజన క్రీడల సర్వీసులశాఖ అధికారి నిర్వహణ బాధ్యతతో పాటు పర్యవేక్షణ చేయనున్నారు.
బాలభవన్లో లలిత కళలపై శిక్షణ..
జిల్లా కేంద్రంలోని బాలభవన్లో లలిత కళలపై విద్యార్థులకు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. డ్యాన్స్, పేరిణి నృత్యం, ఆర్ట్, క్రాఫ్ట్, తబలా, మ్యూజిక్, కోలాటం, డ్రాయింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వనున్నారు. ఈ నెల 26 నుంచి వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు బాలభవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి తెలిపారు. బాలభవన్లో శిక్షణ తీసుకోదలచుకున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారైతే రూ. 20, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులైతే రూ. 50 చెల్లించి పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల నుంచి స్టడీ కండక్ట్ సర్టిఫికెట్తో పాటు ఆధార్ కార్డు తీసుకొని రావాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యార్థులకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు.
24 నుంచి జూన్ 7 వరకు
నిర్వహణకు సమాయత్తం
14ఏళ్ల లోపు బాలబాలికలకు
క్రీడల్లో శిక్షణ
పది శిబిరాల ఏర్పాటుకు అనుమతి
పలు అంశాల్లో శిక్షణ
ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, అథ్లెటిక్స్తో పాటు కబడ్డీ తదితర క్రీడాంశాల్లో విద్యార్తులకు శిక్షణ ఇవ్వనున్నారు. శిబిరాలను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది.
జిల్లాలో 10 శిక్షణ శిబిరాలకు అనుమతి ఉంటుంది. ఈ శిబిరాలలో విద్యార్థులకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలి. 24 నుంచి శిక్షణ శిబిరాలు ప్రారంభమవుతాయి. విద్యార్థులు క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
– బి.వెంకట్రెడ్డి, క్రీడల అధికారి


