సూర్యాపేట టౌన్ : విద్యార్థులకు చర్చా వేదికలు నిర్వహించడం ద్వారా వారి భవిష్యత్కు పునాదులు వేయవచ్చని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) అశోక్ అన్నారు. సర్వశిక్ష అభియాన్, తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో విద్యార్థులకు నిర్వహించిన తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ చర్చా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇందులో జిల్లాలోని 24 పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఒక్కో పీఎం శ్రీ పాఠశాల నుంచి విద్యార్థులు ఒక్కో దేశానికి ప్రాతినిధ్య వహిస్తూ పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. విజేతలుగా 11 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు పిల్లలను దేశ రాయబారులుగా, దౌత్యవేత్తలుగా తయారు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు ఏలె హరికృష్ణ, శ్రవణ్ కుమార్, సోషల్ ఫోరం అధ్యక్షుడు వేముల సైదులు, ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్, న్యాయ నిర్ణేతలుగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కినపల్లి నాగమణి, డీఆర్పీ ఎ.సుదర్శన్రావు, కాకి సీనయ్య తదితరులు పాల్గొన్నారు.


