ఫ పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీకొట్టిన ఆటో
వలిగొండ : పదో తరగతి పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామ సమీపంలో శనివారం జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం పహిల్వాన్పురం గ్రామానికి చెందిన వనగంటి శివరాం స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శనివారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకావడంతో తెలుగు పరీక్ష రాసేందుకు అతడు వలిగొండలోని పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో రెడ్లరేపాక గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ద్విచక్ర వాహనానని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరాంను స్థానికులు 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సహాయకురాలితో
‘పది’ పరీక్షకు హాజరు
మిర్యాలగూడ : మండలంలోని యాద్గార్పల్లి జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థిని వెన్నెలకు పుట్టుకతోనే పోలియో వలన కాళ్లు, చేతులు సరిగా పనిచేయవు. దీంతో ఆమె పదో తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో అదే పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినిని సహాయకురాలి(స్క్రైబ్)గా నియమించారు. శనివారం వెన్నెల సహాయకురాలి సహాయంతో మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి వచ్చి తెలుగు పరీక్ష రాసింది. పదో తరగతి పరీక్షల్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వెన్నెలతో కలిపి 13 మంది విద్యార్థులకు స్క్రైబ్లను అనుమతించారు. పదో తరగతిలో మొత్తం ఏడు పరీక్షలు రాయాల్సి ఉండగా.. ఇలాంటి వారికి ఏదో ఒక పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వెన్నెలకు ఇంగ్లిష్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది.


