మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో నందిబోడు పైన గల కాకతీయుల కాలం(13వ శతాబ్దం) నాటి శివాలయం శిథిలావస్థలకు చేరుకుందని, దానిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం ఆయన బొత్తలపాలెం గ్రామాన్ని సందర్శించి నందిబోడు పైన గల శివాలయాన్ని, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను పరిశీలించారు. శివాలయం గోడలు పడిపోయాయని, ఆలయ వెనుక నిర్మించిన తాత్కాలిక రేకుల షెడ్డు కింద కాకతీయుల కాలం నాటి శివలింగం, పానపట్టం, ముట్టె, చెవులు, భిన్నమైన నంది, తల, కాళ్లు లేని శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవ విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. ఇవి బొత్తలపాలెం గ్రామ చరిత్రకు ఆనవాళ్లని, వాటిని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సర్పంచ్ ఇంజం నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ నర్సింగ్ అనిల్, నాయకులు పడిగపాటి శ్రీనివాస్రెడ్డి, వీరారెడ్డి, రవీందర్రెడ్డి, కందుల భిక్షారెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి


