భానుపురి (సూర్యాపేట) : మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. ప్రతి మహిళ తోటి మహిళకు అండగా నిలువాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, అందుకే వారు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుతం మహిళలు విద్య, విజ్ఞానం, సాంకేతికత, ఉద్యోగం, వ్యాపారం వంటి అన్ని రంగాలలో ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, కోదాడ మున్సిపాలిటీ డిప్యూటీ చైర్పర్సన్ మల్లీశ్వరి, డిప్యూటీ సీఈఓ శిరీష, పంచాయతీరాజ్ ఈఈ రమాదేవి, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీటీఓ రవికుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


