చిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామ శ్మశాన వాటికలో టేకు చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి దుంగలను మాయం చేశారు. బేతవోలు శ్మశాన వాటికలో 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పచ్చదనం పెంపొందించడం కోసం సుమారు 50 టేకుతో పాటు వివిధ రకాల మొక్కలను నాటింది. ప్రస్తుతం అవన్నీ పెద్ద చెట్లుగా ఎదిగాయి. ఇందులో నుంచి 30కి పైగా టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి దుంగలను తరలించారు. టేకు చెట్లు మాయమైనట్లు తెలియకుండా ఉండేందుకు చెట్ల మొదలు భాగాన్ని మట్టితో కప్పివేశారు. లావుగా ఉన్న దుంగలను తరలించి అనుమానం రాకుండా ఉండేందుకు మిగిలిన చెట్ల కొమ్మలను నరికి అక్కడే పడేశారు. దాంతో పాటు మరి కొన్ని చెట్లను కూడా నరికారు. అయితే, శ్మశాన వాటికలోని టేకు చెట్లు మాయమైనట్లు అనుమానం వచ్చిన కొంత మంది గ్రామస్తులు శుక్రవారం లోపలికి వెళ్లి పరిశీలించారు. టేకు చెట్లను నరికి మొద్దులను తీసుకెళ్లి, కొమ్మలు అక్కడే పడేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ స్పందిస్తూ.. శ్మశాన వాటికలో టేకు చెట్లు నరికిన విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు.
30 చెట్లను నరికిన గుర్తుతెలియని వ్యక్తులు


