సూర్యాపేట : కన్న కొడుకే తనను ఇంటి నుంచి గెంటేశాడు. తనకు న్యాయం చేయాలని 76 ఏళ్ల వృద్ధురాలు అధికారులను వేడుకుంటోంది. ఈ మేరకు ఆమె సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగింది. వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం జి.కొత్తపల్లికి చెందిన వృద్ధురాలు గంగుల రమణమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమణమ్మకు గ్రామంలో 3.10 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఉంది. కుమారుడు ప్రభాకర్ ఎస్బీఐలో మేనేజర్గా ఉద్యోగం చేస్తూనే రమణమ్మ పేరుమీద ఉన్న భూమిలో రెండెకరాలు తన పేరుపై రాయించుకున్నాడని పేర్కొంది. మిగతా 1.10 ఎకరాలను తన ఆడపిల్లకు ఇవ్వకుండానే ఇచ్చానని తనను ఇబ్బందుల పాలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తలేని నా బిడ్డ నా వద్ద ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో ఉంటుంటే నన్ను, నా బిడ్డను ఇంటి నుంచి గెంటేసి తాళం వేశాడని తెలిపింది. గ్రామంలో కరువు పనికి వెళ్తూ నేను నా బిడ్డ బతుకీడుస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ కూడా తన కుమారుడు తమను పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేశాడని, కోడలు కూడా దుర్భాషలాడుతోందని కన్నీటి పర్యంతమైంది. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వృద్ధురాలు కోరుతోంది.


