మిర్యాలగూడ టౌన్ : బైక్పై వెళ్తున్న వ్యక్తి యూటర్న్ తీసుకుంటుండగా కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగపాడు గ్రామానికి చెందిన పగడాల మధుసూదన్ (36) ఆదివారం రాత్రి బైక్పై గ్రామంలోని కిరాణ దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ.. జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై యూట ర్న్ తీసుకుంటుండగా త్రిపురారం నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుసూదన్కు తీవ్ర గాయాలు కాగా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. సోమవారం మృతుడి భార్య పగడాల సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 5 తులాల బంగారు ఆభరణాలు,
35 తులాల వెండి వస్తువుల అపహరణ
గరిడేపల్లి : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించారు. ఈ ఘటన గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో జరిగింది. వివరాలు.. అప్పన్నపేట గ్రామానికి చెందిన బత్తిని సైదమ్మ నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లింది. సోమవారం తిరిగి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా.. వస్తువులు, చీరలు చిందరవందరగా పడేసి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఐదు తులాల బంగారం, 35 తులాల వెండి వస్తువులు, రూ.1,30,000 నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపింది. నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్, ఏఎస్ఐ జగన్మోహన్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి వివరాలను సేకరించారు.


