అమెరికా సామ్రాజ్యవాదంతో భారత్కు ముప్పు
సూర్యాపేట అర్బన్ : కేంద్రప్రభుత్వం చేతకానితనం మూలంగా దేశ మార్కెట్ను అమెరికా కబలించేందుకు కుట్రపన్నుతోందని, అమెరికా సామ్రాజ్యవాదంతో భారత్కు ముప్పు పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్లో జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని.. విత్తన చట్టంతో అమెరికాకు లాలూచీ పడుతుందన్నారు. ఏళ్ల తరబడిగా కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని, తద్వారా కార్మికుల హక్కులు కాలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు


