బారువ నారుమడిలో కానరాని మొక్కలు
గత ఏడాది కాయలు కొనుగోలు
చేయకపోవడమే కారణం
అధికారుల తీరుపై మండిపడుతున్న రైతులు
అధిక ధరకు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన
నారు లేకపోవడం దారుణం
కొబ్బరి నారు..
సోంపేట :
జిల్లాలో కొబ్బరి నారుకు కేరాఫ్ అడ్రస్గా బారువలోని కొబ్బరి నారుమడి నిలిచేది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా 2 లక్షలు వరకు మొక్కలు వరకు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా అయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కొబ్బరి మొక్కల కోసం ప్రస్తుతం బారువ నారుమడికి వెళ్తున్న రైతులకు నిరాశే మిగులుతుంది.
ఇదీ పరిస్థితి..
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో బారువలో పండించే నారుమడి కొంతకాలంగా కల్పతరువుగా ఉండేది. నాణ్యమైన కొబ్బరి మొక్కలు కావడంతో ఇక్కడికే వచ్చి నారు తీసుకెళ్లేవారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ ప్రాంత రైతులు ఎక్కువగా కొబ్బరి మొక్కలు నాటేవారు. అయితే కొబ్బరి ధర గత ఏడాది విపరీతంగా పెరిగింది. పది నెలల కిందట వెయ్యి కాయల ధర రూ.35 వేలకు చేరింది. దీంతో అంత ధర పెట్టి కాయలు కొనడం గిట్టుబాటు కాదని భావించిన అధికారులు కొనడం మానేశారు. ఫలితంగా ఇప్పుడు నారు కరువైంది. దీంతో రైతులకు మొక్కలు అందుబాటులో లేకుండాపోయాయి. బయట మార్కెట్లో ఒక్కో కొబ్బరి మొక్క ధర రూ.200 వరకు వెచ్చించి కొనాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందని రాయితీ..
గతంలో బారు నారుమడిలో కొబ్బరి మొక్కను 60 రూపాయలకు కొనుగోలు చేస్తే రైతు ఖాతాలో 40 రూపాయలు జమ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొక్కలు కొనుగోలు చేస్తున్నా రాయితీ నగదు రైతుల ఖాతాల్లో పడటం లేదు. తిత్లీ తుఫాన్ సమయంలోబారువ నారుమడి జీవం కోల్పోతే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాలో నారుమడికి మళ్లీ జీవం పోశారు. లక్షలాది నాణ్యమైన కొబ్బరిమొక్కలు తయారు చేసి తిత్లీలో కొబ్బరి చెట్లు నష్టపోయిన రైతులకు అందజేశారు. ఇప్పుడు మాత్రం ఎటువంటి ప్రోత్సాహకాలు అందడం లేదు. నారుమడిలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రహరి, రహదారులు పూర్తిస్థాయల్లో లేవు. పాలకులు స్పందించి నారుమడి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
రైతులు ఈ సీజన్లోనే తోటల్లో కొబ్బరిమొక్కలు నాటుతుంటారు. ప్రస్తుతం బారువలో కొబ్బరి నారు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు స్పందించి మొక్కలు అందుబాటులో ఉంచాలి.
– మేరుగు తిరుపతిరెడ్డి, బారువ


