అక్రమ మైనింగ్ అరికట్టాలి
● పీజీఆర్ఎస్లో ఆమదాలవలస
సమన్వయకర్త చింతాడ రవికుమార్
ఫిర్యాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పొందూరు మండలం వీఆర్గూడెం గ్రామ పరిధిలోని కొండపై ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తున్న అక్రమ క్వారీ నిర్వహణ నిలుపుదల చేయాలని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్, పొందూరు మండల నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందించారు. గ్రావెల్ తవ్వకాలతో పాటు వృక్షాలు నేలకూలుస్తుండటంతో పర్యావరణానికి తీవ్రనష్టం వాటిల్లుతోందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఓటర్ల మార్పులు, చేర్పులు, వార్డుల విభజన ప్రక్రియలో ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు అనుకూలంగా, వారు సూచించిన విధంగానే కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని, దీనివల్ల ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటింగ్లో నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సరుబుజ్జిలి మండలం విజయరామపురం పంచాయతీలో అంగన్వాడీ హెల్పర్ను రాజకీయ కక్షతో తొలగించడంతో కోర్టును ఆశ్రయించారని, ఆమెకు అనుకూలంగా ఆదేశాలు జారీ అయినందున, తక్షణమే కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. రైతులకు రబీలో రెండో పంటకు యూరియా అందుబాటులో ఉంచాలని విన్నవించారు. సరుబుజ్జిలి మండలం విజయరామపురం, తెలికిపెంట పంచాయతీల్లో పూర్తి చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో పొందూరు మండల పార్టీ అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ సత్యప్రసాద్, రాష్ట్ర సోషల్ మీడియా విభాగం కార్యదర్శి బొడ్డేపల్లి వెంకట సత్యం, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు ఉన్నారు.
ఆక్రమణలు అడ్డుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: నరసన్నపేట మండల ం తామరాపల్లి పంచాయతీ పరిధిలో కోల లక్ష్మణరావు కుమారుడు ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 3–152, ఎల్పీ నెంబర్ 11లోని సుమారు 11 సెంట్ల ప్రభుత్వ స్థలంలో పక్కా భవనం నిర్మాణం చేస్తున్నాడని, ఇది పూర్తిగా అక్రమమని, ఆ నిర్మాణాలు వెంటనే నిలుపుదల చేయాలని పోలాకి మండల జెడ్పీటీసీ, నరసన్నపేట నియోజకవర్గ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య, నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, మరికొందరు నాయకులు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నరసన్నపేట తహసీల్దారుకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. అదే విధంగా, నరసన్నపేట పట్టణ పరిధిలో బోయిన నాగయ్య కుమారుడు చంద్రమౌళి రాతికర్ర చెరువు గర్భంలో స్థలం ఆక్రమించి బహుళ అంతస్తు నిర్మాణం చేస్తున్నాడని, ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. ఈ చెరువులోనే ఉల్లాకుల అప్పారావు (కోవెలవీధి) కుమారుడు కృష్ణ అక్రమ నిర్మాణం జరిపేందుకు చూస్తున్నాడని విన్నవించారు. ఈ ఆక్రమణల విషయమై కోర్టులో కేసు నడుస్తున్నా బేఖాతరు చేస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో రాజాపు అప్పన్న, బీసీహెచ్ గుప్తా, బొబ్బాది ఈశ్వరరావు, మల్లేసు, రౌతు శంకరరావు తదితరులు ఉన్నారు.
ఎస్ఎంసీ చైర్మన్ సంతకం ఫోర్జరీ
రణస్థలం: నారువ హైస్కూల్లో హెచ్ఎం భాస్కరరావు పని తీరు సక్రమంగా లేదని ఎస్ఎంసీ చైర్మన్ నిద్రబంగి ముగతమ్మ గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశారు. ఏకంగా ఎస్ఎంసీ చైర్మన్ సంతకం ఫోర్జరీ చేసి డబ్బులు విత్ డ్రా చేసుకుని సొంత అవసరాలకు వినియోగించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాడు–నేడు పథకంలో మంజూరైన నిర్మాణ సామగ్రి మొత్తాన్ని వ్యాన్తో తీసుకువెళ్లిపోయారని, చెక్కీలు కూడా విద్యార్థులకు ఇవ్వడం లేదన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ నాయకులు జీరు గురునాథరెడ్డి, నిద్రబంగి ఆదినారాయణ తదితరులు ఉన్నారు.
అక్రమ మైనింగ్ అరికట్టాలి


