భూ సమస్యల పరిష్కారానికే ‘రెవెన్యూ క్లినిక్’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ‘రెవెన్యూ క్లినిక్’ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా పలు అర్జీలు స్వీకరించారు. అనంతరం శాఖల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. క్లినిక్లో మొత్తం 21 శాఖలకు సంబంధించి 127 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ నుంచి 43, సెర్ప్ 31, పంచాయతీరాజ్ 15, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 7, నీటి వనరుల శాఖ 4, విద్యుత్ శాఖ 4, వ్యవసాయం, గనులు, ఇతర ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించి పలు వినతులు వచ్చాయి.
● గతంలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు దివ్యాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు వెంటనే భర్తీచేయాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి కోరారు. నియోజకవర్గానికి 25 స్కూటీలు చొప్పున 4375 మందిని లబ్ధిదారులుగా గుర్తించి ఉచితంగా లైసెన్స్ ఇప్పించి అందజేయాలని విన్నవించారు.
● శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా లింగోద్భవ ఘట్టంలో ప్రొటోకాల్ పాటించడం లేదని, వీఐపీల పేరిట ఇతరులు విగ్రహాలను తాకుతుండటం శాస్త్ర విరుద్ధమని అర్చకుడు ఎన్.రాజశేఖర్ కోరారు.
● గార మండలం శాలిహుండంలో గతంలో దళితులకు కేటాయించిన భూములను ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటోందని, తమకు న్యాయం చేయాలని పలువురు కోరారు.


