సమాజ రుగ్మతలు తొలగించేవి నాటకాలు
శ్రీకాకుళం కల్చరల్: సమాజంలో రుగ్మతలను ఎత్తి చూపి వాటిని తొలగించేందుకు నాటకాలు ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్ వేదికగా జరుగుతున్న నాటక పోటీల ముగింపు ఉత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ప్రతి ఏడాది మంచి నాటక పోటీలను నిర్వహించి, కళను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విద్యా మౌళిక వసతుల డైరెక్టర్ పీఎంజే బాబు, మొదలవలస రమేష్లు మాట్లాడుతూ కళా సేవ ఎంతో ఉత్తమమైనదన్నారు.
ఉత్తమ ప్రదర్శన ‘మమ్మల్ని బతికించండి’..
మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలలో ఆరు నాటికలు ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ కళాసమితి వారి ‘మమ్మల్ని బతికించండి నాటిక, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ‘సమయం’ నాటిక, ఉత్తమ జ్యూరీగా గుంటూరు వారి ‘తరమెల్లిపోతోంది’ నాటికలు బహుమతులు దక్కించుకున్నాయి. మానాపురం సత్యనారాయణ, గెద్దా వరప్రసాద్, నూర్బాషా ఖాసీంలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం బహుమతులు అందజేశారు. అంతకుముందు నిర్వహించిన ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక, ‘నిన్ను నీవు గెలుచుకో’ నాటికలు అలరించాయి. కార్యక్రమంలో సుమిత్రా కళాసమితి అధ్యక్ష కార్యదర్శులు ఇప్పిలి శంకర శర్మ, గుత్తు చిన్నారావు, నక్క శంకరరావు, మండవిల్లి రవి, కిల్లా ఫల్గుణరావు, మూర్తి, కె.సురేష్, రాజు పాల్గొన్నారు.
సమాజ రుగ్మతలు తొలగించేవి నాటకాలు


