శభాష్‌ రామచంద్ర | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ రామచంద్ర

Jun 30 2026 3:11 AM | Updated on Jun 30 2026 3:11 AM

34 ఏళ్ల సర్వీసు.. నో యాక్సిడెంట్‌

కదిరి అర్బన్‌: దశాబ్దాల సర్వీసు. ఒక్క ప్రమాదం కూడా లేదు. ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చారు. రోడ్డు భద్రతలో డిపో స్థాయిలో 8 సార్లు, జిల్లా స్థాయిలో 4 సార్లు, రాష్ట్ర స్థాయిలో 2 సార్లు ఉత్తమ డ్రైవర్‌గా అవార్డులందుకున్నారు. కలెక్టర్‌, మంత్రులతో శభాష్‌ అనిపించుకున్నారు. 34 ఏళ్లపాటు చిత్తశుద్ధితో సేవలందించి మంగళవారం రిటైర్మెంట్‌ తీసుకుంటున్న ఆర్టీసీ డ్రైవర్‌ డీ రామచంద్ర ట్రాక్‌రికార్డు ఇదీ. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ డిపోలో ఆయనకు వీడ్కోలకు పలికేందుకు సహచర సిబ్బంది ఏర్పాట్లు చేశారు. రామచంద్ర మాట్లాడుతూ ప్రతి రోజూ తాను డ్యూటీకి గంట ముందుగానే వస్తానని, ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకుండా ధ్యాసంతా డ్రైవింగ్‌పైనే ఉంచడంతోనే అంతా సాధ్యమైందని తెలిపారు.

జెడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు

అనంతపురం న్యూటౌన్‌: జిల్లా పరిషత్‌లో పనిచేసే పలువురు ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేసే ఐదుగురికి పరిపాలనాధికారులుగా పదోన్నతులు కల్పించి, ఉత్తర్వులు అందించారు. కే.రవిప్రసాద్‌ను రొద్దం మండలానికి, బి.రాజా రవి శేఖర్‌–గుంతకల్లు, సి.విజయశ్రీ–గోరంట్ల, జి.పెద్దయ్య–యల్లనూరు, యంవీ రమేష్‌ బాబును ముదిగుబ్బ మండల పరిషత్‌ కార్యాలయాల్లో పరిపాలనాధికారులుగా నియమించినట్లు జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి తెలిపారు. ఇక.. ఉమ్మడి జిల్లాలో పలు మండలాల్లో జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులుగా పని చేస్తున్న 16 మందికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ వివిధ మండలాల్లో పోస్టింగులు ఇచ్చినట్లు జెడ్పీ అధికారులు తెలిపారు.

ఎకై ్సజ్‌ ఎస్‌ఐకు త్రుటిలో తప్పిన ప్రమాదం

చిలమత్తూరు: మండల పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారి కొడికొండ చెక్‌పోస్ట్‌లో ఆదివారం రాత్రి ఎకై ్సజ్‌ ఎస్‌ఐ విజయ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో బెంగళూరు వైపు నుంచి వచ్చిన కారును ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్‌ వేగంగా దూసుకువెళ్లాడు. ఎస్‌ఐ పక్కకు తప్పుకోవడంతో ప్రాణా పాయం తప్పింది. దీనిపై ఎకై ్సజ్‌ పోలీసులు స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. చెక్‌పోస్ట్‌ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు.

ట్రాక్టర్‌, కారు ఢీ.. ముగ్గురికి గాయాలు

పెనుకొండ రూరల్‌: ట్రాక్టర్‌, కారు ఢీ కొనడంతో ముగ్గురు గాయపడిన సంఘటన పెనుకొండ సమీపంలో 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకొంది. కియా పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురం పట్టణంలోని ఆబాద్‌ పేటకు చెందిన ఫయాజ్‌ రెహమాన్‌ ఆరుగురు కుటుంబ సభ్యులతో నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగకు కారులో వెళ్లాడు. సోమవారం ఉదయం తిరిగి హిందూపురం వెళ్తుండగా, స్థానిక గుట్టూరు జంక్షన్‌ సమీపంలో ఎదురుగా రాంగ్‌రూట్‌లో వచ్చిన ట్రాక్టర్‌ కారును ఢీకొంది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న మెహతాజ్‌ భాను, వహిదా భాను, ఫయాజ్‌ రెహమాన్‌ గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెహతాజ్‌ భాను, ఫయాజ్‌ రెహమాన్‌ను అనంతపురం తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ డి. రాఘవయ్య తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement