తనకల్లు: ‘అన్నీ ఉన్నా .. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా మారింది తనకల్లు మండలంలోని చెన్నరాయస్వామిగుడి ప్రాజెక్టు (సీజీ ప్రాజెక్టు) పరిస్థితి. జలకళను సంతరించుకున్నా నిర్వహణ లోపంతో ప్రాజెక్టు కళావిహీనంగా మారింది. గతంలో పర్యాటకులు ఎక్కువగా వచ్చేవారు. వసతుల లేమితో ప్రస్తుతం ఏ ఒక్కరూ ఈ వైపు కన్నెత్తి చూడటం లేదు.
పాపాగ్ని నదిపై నిర్మాణం
సీజీ ప్రాజెక్టును 1954లో పాపాగ్ని నదిపై నిర్మించారు. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 170 ఎంసీఎఫ్టీ ( 0.17 టీఎంసీ). ప్రాజెక్టు రెండు కాలువల కింద ప్రత్యక్షంగా 900 ఎకరాలు, పరోక్షంగా మరో 2,500 ఎకరాలు సాగవుతోంది. ప్రాజెక్టులో నీరుంటే తనకల్లు మండలంలో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
ఆకతాయిలకు అడ్డా..
ప్రాజెక్టు సందర్శనకు వచ్చే కొందరు ఆకతాయిలు గెస్ట్హౌస్ భవనంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. మందుబాబులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. పరిసరాలలో ఎక్కడ పడితే అక్కడ కంపచెట్లు, ముళ్లపొదలు ఉండటంతో ప్రాజెక్టు కళ తప్పింది. దీంతో ప్రాజెక్టులో నిండా నీరున్నా సందర్శకులు మాత్రం రావడం మానేశారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని అవసరమైన నిధులను కేటాయించి సీజీ ప్రాజెక్టును అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
అటకెక్కిన అభివృద్ధి పనులు
నిర్వహణను మరచిన
చంద్రబాబు ప్రభుత్వం
గతంలో పర్యాటకుల తాకిడి.. నేడు ఒక్కరూ కనిపించని వైనం
నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలంటున్న ప్రజలు


