ధర్మవరం: ముదిగుబ్బ మండలంలో కూటమి నాయకుల దౌర్జన్యాలు మితిమీరాయి. రాళ్లనంతపురం క్రాస్లో శనివారం సాయంత్రం టీడీపీ నాయకుడు బూదనాంపల్లి దివాకర్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను ఆక్రమించే ప్రయత్నం చేశారు. బీజేపీ మండల కన్వీనర్ అంజన్రెడ్డి, టీడీపీ నాయకుడు మనోహర్లు ఆయనకు అండగా నిలిచి అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేశారు. వివరాలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాళ్లనంతపురం క్రాస్లోని సర్వే నంబర్లు 33, 50, 51లలో 99 మందికి ఒకటిన్న సెంటు చొప్పున ఇంటి పట్టాలను మంజూరు చేశారు. అయితే అందులోని ఒకరి వద్ద నుంచి టీడీపీ నాయకుడు దివాకర్రెడ్డి ఒక పట్టా (ఒకటిన్నర సెంటు) కొన్నాడు. అయితే జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆయన స్థలం రోడ్డుకు పోయింది. ఆ స్థలానికి సంబంధించిన పరిహారాన్ని ప్రభుత్వం అప్పట్లో చెల్లించింది. అయితే రోడ్డు పక్కన మరి కొంత స్థలం (8 అడుగులు) ఉంది. దానికి తోడుగా రోడ్డు స్థలం, శ్రీనివాసులు, తిరుపాలు, గోపాల్, పరదేశ్, ఈశ్వరయ్య, క్రిష్ట, లలితాబాయి, శ్రీనివాసనాయక్లకు చెందిన సుమారు 14 సెంట్ల స్థలాన్ని దివాకర్రెడ్డి శనివారం దౌర్జన్యంగా జేసీబీతో చదును చేయించాడు. అంజన్రెడ్డి, మనోహర్లు అనుచరులతో అక్కడికి చేరుకొని హల్చల్ చేశారు. ఉన్నతాధికారులే తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల ఆక్రమణకు ప్రయత్నం
జేసీబీతో దౌర్జన్యంగా చదును
పట్టించుకోని పోలీసులు, అధికారులు


