డి హీరేహాళ్(రాయదుర్గం): రైలు కిందకు జీవాలు దూసుకెళ్లిన ఘటనలో 30 గొర్రెలు మృతి చెందాయి. డి.హీరేహాళ్ మండలం హొసగుడ్డం శివారున ఈ ఘటన చోటు చేసుకుంది. హొసగుడ్డం గ్రామానికి చెందిన చౌడిక ముక్కన తనకున్న 72 గొర్రెలను శనివారం మేపు కోసమని అటవీ ప్రాంతానికి తోలుకెళ్లాడు. మార్గమధ్యంలో రైలు పట్టాల పక్కన మేస్తున్న గొర్రెల్లో ఓ గొర్రె అప్పటికే శరవేగంగా వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు నుంచి త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంటూ అవతలి వైపుగా వెళ్లింది. దానిని అనుసరిస్తూ మిగిలిన గొర్రెలు కూడా రైలు కిందకు దూసుకెళుతూ ఒకదాని వెనుక ఒకటి చొప్పున 30 జీవాలు మృతి చెందాయి. ఐదు గొర్రెలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ సమయంలో కాపరి ఎంత అడ్డుకున్నా సాధ్యం కాలేదు. వాటిని కాపాడబోయిన ఇద్దరు కాపర్లు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. ఘటనతో రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.
30 జీవాల మృతి


