రీసర్వే పక్కాగా చేయాలి
● జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఓడీచెరువు : భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమగ్ర రీసర్వే పక్కాగా సాగాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. భూమి విస్తీర్ణం, సరిహద్దులు, రైతు పేర్ల నమోదులో తప్పులు దొర్లకూడదన్నారు. బుధవారం ఆయన మండలంలోని సున్నంపల్లి పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న రీసర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రీ సర్వేకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి, వీఆర్ఓలకు, మండల సర్వేయర్కు తగు సూచనలు చేశారు. జేసీ వెంట మండల సర్వేయర్ మద్దిలేటి, ఆర్ఐ శ్రీనివాసులురెడ్డి , వీఆర్ఓలు ఉన్నారు
ధర్మవరం ఆర్డీఓ,
డీఎస్పీలకు షాక్
● హైకోర్టు ఆదేశాలతో
బాధ్యతల నుంచి తప్పించిన సీఎస్
ధర్మవరం అర్బన్: ధర్మవరం ఆర్డీఓ మహేష్, డీఎస్పీ హేమంత్కుమార్లకు హైకోర్టు షాకిచ్చింది. 2018లో జరిగిన గ్రూప్–1 రిక్రూట్మెంట్లో పలు అవకతవకలు జరిగాయంటూ కొందరు హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యే వరకు 2018 సంవత్సరంలో గ్రూప్–1 అధికారులుగా ఎంపికై న వారందరినీ వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించింది. దీంతో 2018 గ్రూప్–1 బ్యాచ్కు చెందిన ధర్మవరం ఆర్డీఓ మహేష్, డీఎస్పీ హేమంత్కుమార్లను వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారిద్దరూ రిలీవ్ అయ్యారు.
రూ.20 లక్షలు
ఇవ్వకుంటే పీడీ యాక్టు
● హత్య కేసు నిందితులకు
డీఎస్పీ, సీఐ బెదిరింపులు
● లేఖ, వీడియో విడుదల చేసిన బాధితుడు
సాక్షి, టాస్క్ఫోర్స్: పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిపై పీడీ యాక్టు పెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఇదే అదునుగా భావించిన ఓ డీఎస్పీ, సీఐ నిందితులు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. కేసులో ఉన్న ఐదుగురిపై పీడీ యాక్టు లేకుండా చేయాలంటే కనీసం రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు హత్య కేసులోని నిందితుడైన మారుతి ప్రసాద్రెడ్డి బుధవారం ఓ లేఖ, వీడియో విడుదల చేశారు.
వీడియోలో మారుతి ఏం చెప్పాడంటే..
‘‘పుట్టపర్తి నియోజకవర్గంలో డీఎస్పీ విజయకుమార్, కొత్తచెరువు అప్గ్రేడ్ స్టేషన్ సీఐ మారుతీశంకర్..ఇద్దరూ కలిసి నన్ను, నా కుటుంబాన్ని, నా మిత్రులు, వారి కుటుంబాలను అక్రమంగా నిర్బంధించి, అక్రమ కేసులు బనాయిస్తూ విపరీతంగా టార్చర్కు గురిచేస్తూ...గత 30 రోజుల నుంచి విపరీతంగా వేధిస్తూ... మానసిక ఒత్తిడికి గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఓ హత్య కేసులో మమ్మల్ని అక్రమంగా నిర్బంధించిన సమయంలోనే సీఐ మారుతీశంకర్ నాకు చెప్పారు. నువ్వు జైలు నుంచి వచ్చిన వెంటనే రూ.30 లక్షలు... కనీసంగా రూ.20 లక్షలు ఇవ్వకపోతే నీపై పీడీయాక్ట్ కేసు పెట్టి జిల్లా నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. ఈ వీడియో ద్వారా ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను. పోలీసు వ్యవస్థ చాలా బాగుంది. కానీ వీళ్లిద్దరు మాత్రం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి అవినీతికి జనాన్ని బలి చేస్తున్నారు. ఎప్పుడూ ప్రజా సమస్యలపై మాట్లాడే నన్నే ఇంతలా వేధిస్తున్న వీరు సామాన్యులను ఎంతలా ఇబ్బంది పెడుతుంటారో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థను ఎలా తొక్కి పెడతారో..మ్యానేజ్ చేస్తారో తెలుసుకోండి. దయచేసి వీరిని ఉపేక్షించకుండా ప్రజలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీడియా అందరూ కలిసి వీరిపై నిఘా ఉంచి ఇలాంటి చీడ పురుగులను వ్యవస్థలో ఉండకుండా చూడాలని విన్నవించుకుంటున్నా.’’ అంటూ మారుతీ ప్రసాద్రెడ్డి వేడుకున్నారు.
రీసర్వే పక్కాగా చేయాలి


