ఖాద్రీశుని ఖ్యాతి చాటిచెబుదాం
కదిరి టౌన్: ‘‘వసంత వల్లభునిగా, ఖాద్రీశునిగా, భక్తుల కోర్కెలు తీర్చే కాటమరాయుడిగా వెలుగొందుతున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించి ఖాద్రీశుని ఖ్యాతిని ఖండాతరాలకు చాటుదాం’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు పిలుపునిచ్చారు. ఈనెల 27 నుంచి మార్చి 13వ తేదీ వరకు 15 రోజుల పాటు జరగనున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు, భద్రతపై బుధవారం కలెక్టర్ అధ్యక్షతన లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. వైద్య శిబిరాల ఏర్పాటు, తాగునీటి సదుపాయాలు, లైటింగ్ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనుల గురించి వివరించారు. అధికారులు, ఆలయ పాలక మండలి సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి..
ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ... ఖాద్రీశుని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. క్యూలైన్లు, ప్రధాన ప్రాంతాల రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, కంట్రోల్ రూం ఏర్పాటు, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలపై పోలీసులకు పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వెంకటప్రసాద్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో భక్తులు భారీగా పాల్గొంటారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకుడు పార్థసారథిచార్యులు, కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్, సీఐలు వి.నారాయణరెడ్డి, నిరంజన్రెడ్డి, నాగేంద్ర, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా
నిర్వహిద్దాం
అధికారులకు కలెక్టర్
శ్యాంప్రసాద్ ఆదేశం
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ
సతీష్కుమార్తో కలిసి సమీక్ష
ఖాద్రీశుని ఖ్యాతి చాటిచెబుదాం


