మడకశిరలో అదృశ్యం.. హైదరాబాద్లో ప్రత్యక్షం
మడకశిర రూరల్: మండలంలోని బుళ్లసముద్రం గ్రామంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శుక్రవారం అదృశ్యమయ్యారు. అయితే వారిని శనివారం హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బుళ్లసముద్రం గ్రామంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో రవికుమార్, రంజిత్కుమార్ 9వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ పాఠశాలకు చెందిన హాస్టల్లో ఉంటున్నారు. ఏమైందో ఏమో గానీ శుక్రవారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం విద్యార్థులిద్దరూ పాఠశాల నుంచి వెళ్లిపోయారు. గుర్తించిన పాఠశాల నిర్వాహకులు సమీప ప్రాంతాల్లో గాలించినా... ఫలితం లేకపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు... వివిధ పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో కనిపించిన విద్యార్థులను అక్కడి పోలీసులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక పోలీసులను కాచిగూడ పంపించి విద్యార్థులను తీసుకొస్తున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ లావణ్య తెలిపారు.
బుళ్లసముద్రం విద్యార్థులను కాచిగూడలో గుర్తించిన పోలీసులు


