● చికిత్స చేసి పునర్జన్మనిచ్చేది వారే..
● నేడు డాక్టర్స్ డే
నెల్లూరు(అర్బన్): రోగి ప్రాణాలను కాపాడటంలో వైద్యుల పా త్ర అమూల్యమైనది. వైద్య వృత్తి అనేది ఉద్యోగం కాదు. సేవా ధర్మం. పేద, ధనిక అనే తేడా లేకుండా రోగి ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా విసుగు, విరామం లేకుండా అంకిత భావంతో వైద్యం చేస్తారు. తెల్లని చొక్కా ధరించి చిరునవ్వుతో రోగిని పలకరిస్తారు. అలాంటి వారిని ప్రజలు దైవంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం జూలై ఒకటో తేదీన డాక్టర్స్ డే నిర్వహిస్తారు.
రెండు వేల మంది
జిల్లాలో క్లినిక్లు, ఆస్పత్రులు సుమారు వెయ్యి వరకు ఉన్నాయి. ప్రభుత్వపరంగా 52 పీహెచ్సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు, ఒక జిల్లా హాస్పిటల్తోపాటు జిల్లా కేంద్రంలో బోధనాస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 2 వేల మంది డాక్టర్లు పని చేస్తున్నారు.
కరోనా సమయంలో..
కరోనా మహమ్మారి సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవలందించారు. నెల్లూరు పెద్దాస్పత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లు మృతిచెందారు. మరో జూనియర్ డాక్టర్ కూడా అలాగే చనిపోయాడు. పలు ప్రైవేట్ ఆస్పత్రులు కోవిడ్ సమయంలో తలుపులు వేసుకున్నా.. కాపాడింది మాత్రం ప్రభుత్వ వైద్యులేనని చెప్పొచ్చు. అక్కడక్కడా ప్రైవేట్ డాక్టర్లు కూడా నిజాయితీగా పని చేశారు.


