● బస్సెక్కిస్తానంటూ తీసుకెళ్లి
వృద్ధురాలి నిలువు దోపిడీ
● ఆ తర్వాత కాలువలోకి తోసేసిన వైనం
కోవూరు: బంధువే.. రాబందువై ఓ వృద్ధురాలిని నిలువు దోపిడీ చేసి.. కాలువలోకి నెట్టిన ఘటన మండలంలోని జమ్మిపాళెంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలి పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన జలదంకి లక్ష్మీరాజ్యం ఆదివారం మండలంలోని వేగూరులో ఉన్న తన అక్క ఇంటికొచ్చింది. సోమవారం ఆమె తిరిగి కావలికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంతలో అక్క కుమారుడు సతీష్ లక్ష్మీరాజ్యంను ఆటోలో ఎక్కించుకుని ఆత్మకూరు బస్టాండ్లో బస్సు ఎక్కిస్తానని బయలుదేరాడు. కానీ ఆమెను దగదర్తి, అల్లూరు, కోవూ రు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు తిప్పా డు. తర్వాత జమ్మిపాళెంలోని హైవే బ్రిడ్జిపైకి తీసుకెళ్లాడు. వృద్ధురాలి వద్ద ఉన్న బంగారు నగలను లాక్కొన్నాడు. ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న పంట కాలువలోకి తోసేసి పరారయ్యాడు. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ముత్యాలరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో వృద్ధురాలిని క్షేమంగా బయటకు తీశారు. కేసు నమోదు చేశారు. సతీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


